హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని.... ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడు జట్టు ప్రయోజనాల గురించే ఆలోచిస్తాడనేది జరగమెరిగిన వాస్తవం. అలాంటి ధోని గురించి గతేడాది ఆసియా కప్ సందర్భంగా చోటు చేసున్న సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది.
గతేడాది ఆసియాకప్లో పాకిస్థాన్ మ్యాచ్కి ముందు తీవ్ర గాయమైనా అప్పుడు కెప్టెన్గా ఉన్న ధోని బరిలోకి దిగాడట. చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. "పాకిస్థాన్ కీలక మ్యాచ్కు రెండు రోజుల ముందు రాత్రి జిమ్లో ఎక్సర్సైజ్లు చేసే సమయంలో ధోని వెన్నులో నొప్పి రావడంతో కింద పడ్డాడు. అదృష్టవశాత్తూ బరువులు అతడిపై పడలేదు.

అయితే నొప్పితో అతడు లేవలేకపోయాడు. దీంతో అతడిని స్ట్రెచర్పై తీసుకెళ్లాల్సి వచ్చింది. దాంతో ఆందోళన చెందిన ఎమ్మెస్కే నేరుగా ధోని గదికి వెళ్లా. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశా. అతడిలో ఎలాంటి కంగారూ లేదు. 'ఆందోళన వద్దు ఎమ్మెస్కే భాయ్' అని నాకు ధైర్యం చెప్పాడు.
మీడియాతో ఏం చెప్పాలని అడిగినా అతను మళ్లీ అదే మాట అన్నాడు. ఎందుకైనా మంచిదని నేను పార్థివ్ పటేల్ను అందుబాటులో ఉండమని కూడా చెప్పానని ఎమ్మెస్కే చెప్పాడు. అయితే మధ్యాహ్నం తుది జట్టును ప్రకటించే ముందు ధోని జెర్సీ ధరించి మ్యాచ్కు సిద్ధంగా ఉన్నాడు.
నన్ను తన గదికి పిలిచి 'నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు. నేను ఓ కాలు లేకున్నా సరే పాకిస్థాన్తో మ్యాచ్లో ఆడతా' అని అన్నాడు" అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతం నుంచి వచ్చిన ధోని గొప్ప స్థాయికి ఎదిగాడని, అతడిని ఆదర్శంగా తీసుకుని ఎదగాలని కుర్రాళ్లకు ఎమ్మెస్కే ప్రసాద్ పిలుపునిచ్చాడు.