డెహ్రాడూన్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. బాల్యస్నేహితురాలు సాక్షి సింగ్ రావత్ ను పరిణయమాడి ఓ ఇంటివాడయ్యారు. డెహ్రాడూన్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలాసవంతమైన విశ్రాంతి రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు వధూవరులకు సంబంధించిన అత్యంత దగ్గర బంధువులు, స్నేహితులు 50-60 మంది మాత్రమే హాజరయ్యారు. పలువురు క్రికెట్ సహచరులు కూడా వచ్చారు. శనివారం రాత్రి ధోనీ-సాక్షిసింగ్ ల నిశ్చితార్థం జరిగింది. వివాహం అక్టోబర్ లో జరుగుతుందని కుటుంబ సభ్యుల తొలుత ప్రకటించారు. అయితే వచ్చే కొద్దినెలల్లో తీరికలేని క్రికెట్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో పెళ్లిని ముందుకు జరిపినట్లు భావిస్తున్నారు. వివాహ వేడుక రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. వరుడు ధోనీ గుర్రంపై వివాహ వేదిక వద్దకు వచ్చారు. వధువు బృందం మాత్రం కాలినడకనే అక్కడకు చేరింది. ధోనీ నలుపు రంగు షేర్వాణిని, సాక్షిరావత్ చుడీదార్ -పైజమాను ధరించారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..మీడియాను ప్రధాన ద్వారానికి కిలోమీటర్ దూరానికే పరిమితం చేశారు. వివాహానికి హాజరైన కొద్దిమంది అతిథులను నాలుగు వాహనాల్లో వేదిక వద్దకు తీసుకొచ్చారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ , క్రికెటర్లు హర్భజన్ సింగ్ , ఆశిష్ నెహ్రా, ఆర్ .పి.సింగ్ , సురేశ్ రైనా, రోహిత్ శర్మ, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని, బీసీసీఐ కార్యదర్శి ఎన్ .శ్రీనివాసన్ లు ఈ వివాహానికి హజరయ్యారు. ధోనీకి స్నేహితుడు, నటుడు జాన్ అబ్రహాం, కోరియోగ్రాఫర్ ఫరాఖాన్ వంటి వారు కూడా వచ్చారు. ఈ నెల 7న ముంబయిలో వివాహ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు ధోనీ తన 29వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ధోనీ, సాక్షిలది ఔరంగాబాద్ . వీరు రాంచీలోని డీఏవీ, షామిలీ పాఠశాలల్లో మిత్రులుగా ఉన్నారు. వారి తండ్రులు కూడా ఒకేచోట పనిచేశారు. రావత్ కుటుంబం మాత్రం పదవీవిరమణ తరువాత డెహ్రాడూన్ లో స్థిరపడింది. 23 ఏళ్ల సాక్షిసింగ్ రావత్ హోటల్ మేనేజ్ మెంట్ విద్యను అభ్యసిస్తున్నారు. ధోనీ-సాక్షి జంటకు బాలీవుడ్ తారలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బిపాసా బసు, శిల్పాషెట్టి, గాయని ఆశా భోంస్లేలు ట్విట్టర్ లో అభినందనలు చెప్పారు.