సక్సెస్ కెప్టెన్:
ఐపీఎల్లో సక్సెస్ కెప్టెన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోనీ. ఐపీఎల్లో చెన్నైని విజయవంతమైన జట్టుగా నిలిపాడు. ఈ నేపథ్యంలో చెన్నై యాజమాన్యం ధోనీకి బాగానే ముట్టజెప్పుతారు. అయితే తాజాగా తొలి ఐపీఎల్లో ధోనీ వేలం ఎంతో తెలిసింది. ఐపీఎల్ వేలంపాట మాజీ నిర్వాహకుడు రిచర్డ్ మాడ్లీ ధోనీ తొలి వేలం వివరాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.
|
కనీస ధర రూ.4లక్షలు:
2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలం పాటలో ధోనీ కనీస ధర రూ.4లక్షలు. అప్పటికే టీమిండియాకు టీ20 ప్రపంచకప్ తేవడంతో ఒక్కసారిగా ధోనీ స్టార్ అయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీకి రూ.15లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ కొనుగోలు పత్రానికి సంబంధించిన ఫొటోను రిచర్డ్ మాడ్లీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. 'మీరు చూస్తుంది క్రికెట్ జ్ఞాపకాల్లో అరుదైన భాగం' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అయింది. మాడ్లీ చేసిన ట్వీట్ను చెన్నై యాజమాన్యం తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ఫైనల్లో చెన్నై ఓటమి:
ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ను 2010, 2011, 2018లో ఛాంపియన్గా నిలబెట్టాడు. 2010లో ముంబైని 22 పరుగుల తేడాతో ఓడించి చెన్నై తొలిసారి ఛాంపియన్గా నిలిచింది. ఇక ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నై ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ (59 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించినా జట్టును గెలిపించలేకపోయాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (17 బంతుల్లో 29; 4 సిక్సర్లు) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేసింది.