హైదరాబాద్: వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోని తనను ఎన్నోసార్లు రక్షించాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ని సాంతం ధోని కెప్టెన్సీలో ఆడిన కోహ్లీ 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో అరంగేట్రం చేశాడు.
కెరీర్ తొలినాళ్లలో వన్డేలు, టెస్టుల్లో కోహ్లీ నిలకడను ప్రదర్శించకపోయినా తన టాలెంట్, సామర్ధ్యాలపై నమ్మకముంచి జట్టు నుంచి తొలగించకుండా చాలాసార్లు తనను రక్షించాడని బీసీసీఐ టీవికి ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ పేర్కొన్నాడు. ధోని తనకు మద్దతుగా నిలుస్తూ ఎన్నో అవకాశాలను కల్పించాడని కోహ్లీ తెలిపాడు.

అన్నా! నువ్వెప్పుడూ నా కెప్టెన్ వే: ధోనిపై కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
జట్టు నుంచి తొలగించకుండా తనను ఎన్నోసార్లు కాపాడాడని, ఒక క్రికెటర్గా ఎదిగేందుకు కావాల్సిన సమయాన్ని, స్పేస్ను కల్పించాడని చెప్పాడు. భారత్కు అన్ని ఫార్మెట్లలో కూడా ధోని అద్భుత విజయాలనందించాడని చెప్పాడు. ధోని నుంచి తీసుకొన్న బాధ్యతలు నిర్వర్తించడం అనుకున్నంత సులువేమీ కాదని చెప్పాడు.
మహేంద్ర సింగ్ ధోని అంటే ముందుగా గుర్తొచ్చేది 'కెప్టెన్' అనేననీ అతడిని మరోలా గుర్తించలేమని వ్యాఖ్యానించాడు. ధోని ఎప్పటికీ తనకు కెప్టెన్యేనని కోహ్లీ తెలిపాడు.
బుధవారం పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న నేపథ్యంలో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా కోహ్లీని నియమించారు. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్కు ధోనిని వికెట్ కీపర్, బ్యాట్స్మన్గా జట్టులో ఎంపిక చేశారు.