ఇటీవల ధోనీ ఫాం
ధోనీ ఫాంలో ఉన్నప్పుడు బ్యాటింగ్కు దిగిన ప్రతిసారి తప్పకుండా గెలిపించేవాడు. బెస్ట్ ఫినిషర్గా కూడా ఎప్పుడు నిలిచేవాడు. కానీ ఇటీవల అలాంటి ఆటతీరు కనబడటం లేదు. మ్యాచ్లను గెలుపుతో ముగించలేకపోతున్నాడు. 2016 ఆగష్టు 27న వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో లాస్ట్ బాల్కు రెండు పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ ఔటయ్యాడు. ఢిల్లీలో న్యూజిలాండ్పై జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో దిగి కూడా 69 బంతుల్లో 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది.
విజయాలు
ఓ వైపు టెస్ట్ కెప్టెన్గా ఉన్న కోహ్లీ సారథ్యంలో భారత జట్టు విజయాలతో దూసుకెళ్తోంది. ఓటమి ఎరుగకుండా వరుసగా అయిదు టెస్టు సిరీస్లు నెగ్గింది. కోహ్లీ కెప్టెన్గా రికార్డ్ స్థాయిలో వరుసగా 18 టెస్టులు గెలిపించాడు. దీంతో భారత్ నెంబర్ వన్గా నిలిచింది. అదే సమయంలో వన్డేలు, ట్వంటీ 20ల్లో సక్సెస్ రేటు పడిపోయింది.
దూసుకెళ్తున్న కోహ్లీ
కెప్టెన్గా కోహ్లీ టెస్టు జట్టును మార్చేశాడు. రెండు సంవత్సారల క్రితం జట్టు కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కోహ్లీ అద్భుతమైన సక్సెస్ రేట్ను నమోదు చేశాడు. ముఖ్యంగా వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లపై దూకుడుగా విజయాలు సాధించాడు. కెప్టెన్గా ఉండి కూడా టెస్టుల్లో 2016లో 75.93 యావరేజ్తో 1215 పరుగులు చేశాడు. మూడు ఫార్మెట్లలో కూడా మ్యాచ్ విన్నింగ్ బ్యాట్స్మన్గా మారాడు.
కెప్టెన్ అవసరం
ధోనీ వయసు 35 సంవత్సరాలు కావడంతో 2019లో జరగబోయే వన్డే వరల్డ్ కప్కు అతని సేవలు అనుమానమే. అప్పటికి పరిస్థితులు ఆకళింపు చేసుకోవడానికి కోహ్లీకి చేతిలో రెండు సంవత్సరాలు ఉంటాయి. దీంతో ఇప్పుడు ఇది చాలా అవసరమైన మార్పు అంటున్నారు.
బీసీసీఐ ఎఫెక్ట్
బీసీసీఐలో పదవుల మార్పు నేపథ్యంలో.. అడ్మినిష్ట్రేషన్లో ఖచ్చితమైన మార్పులు రానున్నాయి. ధోనీ టెస్ట్ కెప్టెన్గా తప్పుకోవడం, రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక అప్పట్లో జట్టు డైరెక్టర్గా రవిశాస్త్రి రావడమనే పుకార్లున్నాయి. రవిశాస్త్రికి ముందున్న డంకన్ ఫ్లెచర్తో ధోనీ వెసులుబాటుగా ఉండేవాడు. జట్టు సభ్యులను ఎంపిక చేయడంలో సెలక్టర్లు, కెప్టెన్కు మధ్య వచ్చే అభిప్రాయ బేధాల కంటే తప్పుకోవడం మేలని ధోనీ భావించి ఉంటాడనే వాదన ఉంది.