హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్లో ఆడే టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోని గైడెన్స్ ఎంతో అవసరమని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఢిల్లీలో గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో సెహ్వాగ్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 'నా కెరీర్లో నేను 2003లో తొలి వరల్డ్ కప్ ఆడాను. సౌరభ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే లాంటి సీనియర్ ఆటగాళ్లతో ఆడటం నాకు ఎంతో కలిసి వచ్చింది. వారి సలహాలు, సూచనల మేరకు నా ఆటలో ఎన్నో మార్పులు చేసుకున్నాను' అని సెహ్వాగ్ అన్నాడు.
'ఆ తర్వాత క్రికెట్లో బాగా రాణించగలిగాను. ప్రస్తుత భారత జట్టులో కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. ధోనీ లాంటి అనుభవం ఉన్న ఆటగాడితో డ్రెస్సింగ్ రూమ్, మైదానాన్ని పంచుకోవడం వీరికి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. 2019 వరల్డ్ కప్లో భారత జట్టుకు ధోనీ మార్గదర్శకం ఎంతో అవసరం' అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం సెహ్వాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్గా బాధ్యతలు నిర్వహిస్తోన్నాడు. ఐపీఎల్ 2018 సీజన్లో పంజాబ్ జట్టుకు తమిళనాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్గా వ్యవహారిస్తున్నాడు. టోర్నీలో భాగంగా పంజాబ్ తన తొలి మ్యాచ్ని ఢిల్లీతో ఆడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 8న మొహాలి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.