హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్ కీపర్గా నిలిచాడు. శ్రీలంకతో ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక క్రికెటర్ ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు.
ఈ సిరీస్లోనే 99 స్టంపౌట్స్తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేసిన ధోని, తాజాగా స్టంపింగ్తో అతడి రికార్డుని అధిగమించాడు. లంక ఇన్నింగ్స్ లో భాగంగా 45 ఓవర్ చివరి బంతికి దనంజయను ధోని స్టంపింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించాడు.

అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోని వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి. వన్డే క్రికెట్లో 100 స్టంపింగ్లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్గా ధోని రికార్డు నెలకొల్పాడు.
2004, డిసెంబరు 23న వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ధోని తన తొలి స్టంపౌట్ని ఏ జట్టుపై, ఎవరి బౌలింగ్లో చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ బౌలర్ ఏమంత దిగ్గజ బౌలర్ కాకపోయినప్పటికీ, ప్రపంచ క్రికెట్లో తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు. ఇంకెవరు? క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కరే.
బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సచిన్ బౌలింగ్లోనే ధోని తన మొట్టమొదటి స్టంపౌట్ని చేశాడని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. ఇక వన్డేల్లో 100 స్టంపింగ్లు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్గా రికార్డు సృష్టించిన ధోనిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు, సహచర క్రికెటర్లు, అభిమానులు 'మిస్టర్ కూల్'ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఎవరెన్ని మ్యాచుల్లో:
* మహేంద్ర సింగ్ ధోనీ (భారత్) - 301 వన్డేల్లో 100
* కుమార సంగక్కర (శ్రీలంక )- 404 వన్డేల్లో 99
* రమేశ్ కులువితరణ (శ్రీలంక)- 189 వన్డేల్లో 75
* మొయిన ఖాన్ (పాక్) - 219 వన్డేల్లో 73
* ఆడమ్ గిల్క్రిస్ట్ (ఆసీస్) - 287 వన్డేల్లో 55
* నయన్ మోంగియా (భారత్)- 140 వన్డేల్లో 44
3జీ, 4జీ కంటే ధోని వేగంగా కదులుతాడని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించగా.... ధోని లాంటి 'ఎ'వన్ క్రికెటర్ మరొకరు లేరని రవీంద్ర జడేజా ట్వీట్ చేశారు. కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాట్స్మన్, ఫినిషర్, రికార్డ్ బ్రేకర్గా అతడిని మించినవాడు లేడని పేర్కొన్నారు.
'లక్ష్మణరేఖ దాటిన వంద మంది పురుషులను శిక్షించిన మొట్టమొదటి వ్యక్తి ధోని అని, ఈ అద్భుతం శ్రీలంకలో జరిగింది' అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారిక ట్విటర్లో ట్వీట్ చేసింది.