హరారే: వన్డే ప్రపంచ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా జట్టుకు ఎన్ని చిరస్మరణీయ విజయాలనందించిన ధోని వికెట్ కీపర్గా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని 350 సార్లు (స్టంప్ ఔట్, క్యాచ్లు) ఔట్ చేసిన నాల్గవ వికెట్ కీపర్ ఘనతను సాధించాడు. హరారే వేదిగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య బుధవారం జరుగుతున్న వన్డే మ్యాచ్లో చిగుంబరను క్యాచ్ రూపంలో ఔట్ చేయడంతో ధోనీ ఈ ఘనత సాధించాడు.

భారత బౌలర్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో చిగుంబుర క్యాచ్ని ధోనీ అందుకున్నాడు. మొత్తంగా చూస్తే 278 మ్యాచ్ల్లో 261 క్యాచ్లు, 89 స్టంప్ ఔట్లను ధోని చేశాడు. దీంతో ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధికమంది బ్యాట్స్మెన్లను డిస్మిసల్ చేసిన కీపర్లలో ధోనీ నాలుగో స్థానంలో నిలిచాడు.
కాగా వన్డేల్లో అత్యధిక డిస్మిసల్ చేసిన వికెట్ కీపర్లలో తొలి మూడు స్థానాల్లో శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర (482), ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ (472), మార్క్ బౌచర్ (424)తో ఉన్నారు. ఇక వన్డే మ్యాచ్ల్లో 300 వికెట్ల క్లబ్లో చేరిన ఏకైక భారతీయ వికెట్ కీపర్ ధోని కావడం విశేషం.