ముంబై: క్రికెట్లో అరుదైన రికార్డ్ సృష్టించిన ప్రణవ్ ధనవాడే పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రణవ్ పైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, భారత వన్డే, టీ ట్వంటీ క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసలు కురిపించారు.
దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్లో స్పందిస్తూ... అద్భుతమైన ఇన్నింగ్స్ అని, నమ్మదగని రికార్డ్ ప్రణవ్ సృష్టించాడని, 232 బంతుల్లో 1009 పరుగులు నాటౌట్, అద్భుతమని పేర్కొంటూ ప్రణవ్కు శుభాకాంక్షలు తెలిపారు. మేమంతా గర్విస్తున్నామని, ఇలాగే ఆడాలని కోరుకున్నారు.
ధోనీ స్పందన
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఇంటర్ స్కూల్ లెవెల్ టోర్నమెంట్లో కేసీ గాంధీ స్కూల్ తరపున బరిలోకి దిగి ఆర్యా గురుకుల్ పాఠశాల జట్టుపై 1009 పరుగులు చేసిన ప్రణవ్ ధనవాడేను టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభినందించారు.

ధోనీ మాట్లాడుతూ... కొత్తగా ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకోవడంలో ప్రణవ్కు తల్లిదండ్రులు, కోచ్ అండగా నిలవాలని సూచించారు. ప్రణవ్కు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేస్తుందని, ఎక్కడికి వెళ్లినా అంతా గుర్తుపడతారని, పలువురు అభినందనలతో ముంచెత్తుతారని, అవేవీ తలకెక్కించుకోకుండా ఉండగలిగితే ప్రణవ్ అంతర్జాతీయ క్రికెటర్గా ఎదుగుతాడనడంలో సందేహం లేదన్నారు.
అలాకాకుండా అంతా ప్రత్యేకంగా చూస్తున్నారని ఏ మాత్రం గర్వం ప్రదర్శించినా అద్భుతమైన భవిష్యత్ నాశనమైపోతుందని హితవు పలికారు. అంత స్కోర్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. దానిని అంతా గుర్తించుకోవాలని, నేడు ప్రణవ్ సాధించిన ఘనత అనితర సాధ్యమైనదన్నారు. ఈ పరిస్థితులను నెగ్గుకురావడం ప్రణవ్కు కత్తిమీద సామేనని ధోనీ అభిప్రాయపడ్డారు. అన్ని పరుగులు చేయడం జోక్ కాదన్నాడు.