న్యూఢిల్లీ: కెప్టెన్ కూల్గా పేరు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అలాగే కొనసాగాలనుకుంటే తప్పకుండా యోగా చేయాలని మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ సూచించారు. ప్రస్తుతం ధోనీ కష్టకాలంలో ఉన్నాడని చెప్పారు. దాన్నుంచి బయటపడాలంటే యోగా చేయాల్సిందేనని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ చేతిలో వరుస పరాజయాల నేపథ్యంలో.. జట్టు మేలు కోసం నాయకత్వం నుంచి తప్పుకునేందుకు కూడా తాను సిద్ధమని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొనడంపై మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ పై విధంగా స్పందించారు.

'ఈ తరహాలో ధోనీ మాట్లాడటం ఇదే తొలిసారి. అతను ఎంత మాత్రం 'కెప్టెన్ కూల్'గా కొనసాగలేడు. కలత చెందినట్లు కనిపించాడు. మైదానంలోనూ అలాగే కనిపించాడు. తాను శరీరకంగా, మానసికంగా అలసిపోయానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. ఈ దశ నుంచి బయటపడాలంటే ధోనీ యోగా కసరత్తులు చేయాల్సిన అవసరం ఉంది' అని బేడీ పేర్కొన్నారు.
బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ను ఢీకొనడాన్ని బేడీ తప్పుపట్టారు. బంగ్లాదేశ్ ఈ సీరిస్ను సొంతం చేసుకోవడంపై మాట్లాడుతూ.. ఆ జట్టు సమష్టిగా రాణించిందని చెప్పారు. సమష్టి తత్వం లోపించిన కారణంగానే టీమిండియా ఓటమిపాలైందని తెలిపారు. ఓటమిని టీమిండియా అవమానంగా భావించాల్సిన అవసరం లేదని చెప్పారు.