
హైదరాబాద్: కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోని మెరుపు స్టంపింగ్తో మరోసారి తన మార్క్ చూపిన సంగతి తెలిసిందే. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16 ఓవర్ రెండో బంతిని హిట్ చేసేందుకు దక్షిణాఫ్రికా ఓపెనర్ మర్క్రమ్ (32) క్రీజు వెలుపలికి వెళ్లాడు.
అయితే బంతి అతని బ్యాట్కి అందకుండా.. నేరుగా వెనక్కి వెళ్లింది. క్షణాల వ్యవధిలో బంతిని అందుకున్న ధోని బెయిల్స్ని ఎగరగొట్టేశాడు. వికెట్ల వెనుక ధోని వేగాన్ని అర్థం చేసుకున్నాడేమో ఏమో తెలియదు గానీ.. బంతి వెనక్కి వెళ్లగానే క్రీజు లోపలికి మళ్లీ వచ్చేందుకు కూడా మర్క్రమ్ ప్రయత్నించక పోవడం విశేషం.
ఈ స్టంపౌట్తో ధోని వికెట్ల వెనకన ఉండి 400 మందిని పెవిలియన్కు పంపించిన ఘనత సాధించాడు. అంతేకాదు భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి వికెట్ కీపర్గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు ధోని 314 వన్డేల్లో 399 డిస్మిసల్స్ చేశాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భువీ బౌలింగ్లో హషీమ్ ఆమ్లాను క్యాచ్ అవుట్ చేసి కీపర్గా 399వ వికెట్ సాధించాడు.
ఇందులో 294 క్యాచులు, 105 స్టంపింగ్స్ ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో నాలుగో వికెట్ కీపర్గా ధోని ఘనత అందుకున్నాడు. ధోనికి ముందు ఈ ఘనత సాధించిన వారిలో కుమార సంగక్కర (482), గిల్క్రిస్ట్ (472), బౌచర్ (424) ఉన్నారు. మూడో వన్డేలోనే మిల్లర్ క్యాచ్ని కూడా ధోని అందుకోవడంతో ఔట్ల సంఖ్య 401కి చేరింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.