హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని మహీ తన ఆటతీరు మార్చుకోవాలని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ సూచించాడు. ప్రస్తుత భారత్ జట్టులో ప్రతిభ ఆధారంగానే ప్లేయర్లను తీసుకునే విషయాన్ని గుర్తు చేశాడు. ఇదే స్థాయి ప్రదర్శనను కొనసాగిస్తే ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కడం సందేహమేనని అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా ధోనీ.. ఏడాదిగా పరిమిత ఓవర్లలో రాణించలేకపోవడాన్ని గుర్తు చేశాడు.
'2019 ప్రపంచ కప్లోనూ ధోనీ ఆడాలని మేనేజ్మెంట్ అనుకుంటే అతడు సత్తా చూపే స్థానంలోనే ఆడించాలి. 24-25 ఓవర్లలో ఇన్నింగ్స్ను నిర్మించాల్సిన తరుణంలో అతడు విఫలమవుతున్నాడు. ధోనీ గొప్ప బ్యాట్స్మన్. కానీ ఏడాదిగా అతడు రాణించలేకపోతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఆటలో లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరముంది' అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
ఇక, కేఎల్ రాహుల్, అజింక్యా రహానెలను జట్టు ఉపయోగించుకోవడం లేదని దాదా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకనైనా వాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వడంపై దృష్టి సారించాలన్నాడు. మిడిలార్డర్లో... టాప్ నుంచి నాలుగో స్థానంలో ఆడే బ్యాట్స్మన్ను మంచి ఆటతీరు కనబర్చే ప్లేయర్ను ఎంచుకోవాలని సూచించాడు. దీనికి కేఎల్ రాహుల్ సరిపోతాడని అయితే అతనిని తుది జట్టులో క్రమంగా తీసుకుంటుండటం పట్ల అతని ఆట మెరుగుపడుతుందని పేర్కొన్నాడు.
మరో సందర్భంలో తాను కెప్టెన్గా ఉంటే కేఎల్ రాహుల్ను ఓ 15 మ్యాచ్ల వరకూ ఆడించేవాడినని తెలిపాడు. ధోనీ ఆటతీరుపై గంగూలీతో పాటు పలువురు విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. అందులో సునీల్ గవాస్కర్, గంభీర్లు ముందుండగా కెప్టెన్ కోహ్లీ.. ధోనీని మాత్రం సమర్థిస్తున్నాడు.