కాన్బెర్రా: భారత్ వన్డే, ట్వంటీ 20 సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ అత్యుత్తమ కెప్టెన్ అని మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ మైకేల్ హస్సీ కితాబిచ్చారు. వరుసగా నాలుగు వన్డేలలో భారత్ ఓటమి నేపథ్యంలో ధోనీ పైన ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే.
గతంలోనే ధోనీ పైన కొందరు విమర్శలు చేశారు. ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వరుసగా నాలుగు వన్డేలు భారత్ ఓడింది. ఈ నేపథ్యంలో హస్సీ స్పందించాడు. ఇప్పటికీ భారత్ను సమర్థవంతంగా నడిపించగల నాయకుడు ధోనీయే అన్నాడు.
కాన్బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన నాలుగో వన్డేలో కీలక సమయంలో ధోనీ డకౌట్గా పెవిలియన్ చేరడం, భారత్ 25 పరుగుల తేడాతో ఓటమిపాలవడం పైన విమర్శలు తగదన్నాడు. కొంతకాలంగా టీమిండియాను ధోనీ సమర్థంగా నడిపిస్తున్నాడని చెప్పాడు.

తాజాగా జట్టుకు పరాజయాలు ఎదురైనా ఇప్పటికీ అతనే భారత్ జట్టుకు తగిన నాయకుడని హస్సీ కొనియాడాడు. అరంగేట్రం చేసిన భారత్ ఆటగాళ్లు ధోనీని చూసి మ్యాచ్ ముగించే విధానం నేర్చుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ మెరుగ్గానే ఆడుతోందన్నాడు.
పరిస్థితిని బట్టి ఆడటంలో ధోనీ బెస్ట్ అన్నాడు. కెప్టెన్సీ అనేది చాలా కఠినమైన పని అని అందరు గుర్తుంచుకోవాలని చెప్పాడు. ప్రతిసారి ప్రతి ఆటగాడు 30 బంతుల్లో 60 పరుగులు చేయలేరన్నాడు. అలాగే ధోనీ అప్పుడప్పుడు పరుగులు చేయలేకపోవచ్చునని అభిప్రాయపడ్డాడు. కానీ అతనే బెస్ట్ ఫినిషర్ అన్నాడు.
ఐదో వన్డేకు మాక్స్వెల్ దూరం
భారత్తో శనివారం జరగనున్న ఐదో వన్డేకు గాయం కారణంగా ఆసిస్ క్రికెటర్ మాక్స్వెల్ దూరం కానున్నాడు. కాన్బెర్రా వన్డేలో పేసర్ ఇషాంత్ శర్మ విసిరిన బంతి మోకాలికి సమీపంలో బలంగా తగలడంతో మాక్స్వెల్ గాయపడ్డాడు.