ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు రామకృష్ణ ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. అటు బంతితో, ఇటు బ్యాట్తో సత్తా చాటుతున్న అతడిని అభిమానులు దేశవాళీ క్రికెట్లో 'జూనియర్ హార్దిక్ పాండ్యా' అని పిలుస్తున్నారు. రామకృష్ణను ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోవడంతో రాబోయే ఐపీఎల్ సీజన్లో అతను కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది. సీఎస్కేకు తన ఆల్ రౌండ్ షోతో జట్టుకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు.
ఉత్తరాఖండ్పై ఆల్ రౌండ్ విధ్వంసం
డిసెంబర్ 31న ఉత్తరాఖండ్తో జరిగిన మ్యాచ్లో రామకృష్ణ ఘోష్ తన విశ్వరూపం చూపించాడు. బ్యాటింగ్లో కేవలం 31 బంతుల్లోనే 151.61 స్ట్రైక్ రేట్తో 47 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్లో 6 ఓవర్లు వేసి కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (124) సెంచరీతో మెరవగా.. మహారాష్ట్ర 129 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

టోర్నీలో రామకృష్ణ 'హవా'
ఈ సీజన్లో రామకృష్ణ ప్రదర్శన నిలకడగా సాగుతోంది. అతను ఆడిన 4 మ్యాచ్ల్లోనూ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. హిమాచల్ ప్రదేశ్పై 9.4 ఓవర్లలో 42 పరుగులకే 7 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. పంజాబ్పై బౌలింగ్లో 3 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్లో 73 పరుగులు బాదాడు. సిక్కింపై 3 వికెట్లు పడగొట్టి, బ్యాటింగ్లో 18 పరుగులు (నాటౌట్) చేశాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రామకృష్ణ ఘోష్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
సీఎస్కేకు ఎందుకు ముఖ్యం?
ఐపీఎల్ 2026 వేలానికి ముందే రామకృష్ణను రిటైన్ చేసుకున్న ధోనీ సేన.. అతడిని ఫినిషర్గా, పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్గా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. టీమిండియాలో హార్దిక్ పాండ్యా ఎలాంటి పాత్ర పోషిస్తాడో, సీఎస్కేలో రామకృష్ణ అచ్చం అలాగే 7వ నంబర్ వద్ద బ్యాటింగ్కు వచ్చి మ్యాచ్ను మలుపు తిప్పగలడు.