హైదరాబాద్: పల్లెకెలె వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. వన్డే కెరీర్లో ధోని 99వ స్టంపౌట్ చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక స్టంపింగ్లు చేసిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డుని సమం చేశాడు.
కుమార సంగక్కర 404 వన్డేల్లో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం 298 వన్డేల్లోనే ఈ ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఓపెనర్ గుణతిలకను స్టంపింగ్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు.

తద్వారా రెండో వన్డేలో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ గుణతిలక అవుటయ్యాడు. చాహల్ వేసిన 14.1వ బంతిని ఆడేందుకు గుణతిలక క్రీజు వదిలి ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ధోని వికెట్లను గిరాటేశాడు.
ఇదిలా ఉంటే శ్రీలంక మాజీ వికెట్ కీపర్ రోమేశ్ కల్వితరణ 189 మ్యాచ్ల్లో 75 స్టంపింగ్లు చేసి రెండో స్ధానంలో నిలవగా.... పాకిస్థాన్కు చెందిన మాజీ వికెట్ కీపర్ మొయిన్ ఖాన్ 219 మ్యాచ్ల్లో 73 స్టంపింగ్లతో మూడో స్ధానం, ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 287 మ్యాచ్ల్లో 55 స్టంపింగ్లతో నాలుగో స్ధానంలో ఉన్నారు.