Dinesh Karthik: భారత క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగిన ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ ఒకరు. ఆయన తాజాగా తన కెరీర్పై సహచర ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ప్రభావం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎంఎస్ ధోనీ రాకతో తాను జట్టులో చోటు నిలబెట్టుకోవడం కోసం ఊసరవెల్లిలా అనేక పాత్రల్లో ఒదిగిపోవాల్సి వచ్చిందని దినేష్ కార్తీక్ వెల్లడించారు.
ధోనీ అరంగేట్రంతో పెరిగిన సవాల్
2004ల ధోనీ కంటే 3 నెలల ముందే దినేష్ కార్తీక్ భారత జట్టులోకి అడుగుపెట్టాడు. కానీ ధోనీ రాకతో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఎక్కువైంది. తాజాగా దినేష్ కార్తీక్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ధోనీ తన కెరీర్ ప్రారంభంలోనే భారీ సిక్సర్లతో అందరినీ ఆశ్చర్యపరిచారని, త్వరలోనే భారత ప్రధాన వికెట్ కీపర్-బ్యాటర్గా ఎదిగారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఎంఎస్ ధోనీ పవర్ ఫుల్ షాట్లను క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబర్స్ హిట్టింగ్తో పోల్చేవారని కూడా దినేష్ కార్తీక్ వివరించారు.

దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. " అప్పటికే రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపింగ్ చేస్తున్నప్పటికీ.. ఆయన కేవలం బ్యాటింగ్పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో జట్టుకు ఒక శాశ్వత వికెట్ కీపర్ అవసరం ఏర్పడింది. నాకు కొద్దికాలం మాత్రమే ఆ అవకాశం దొరికింది. కానీ ప్రధాన పాత్ర ధోనీకే దక్కింది. అతను వచ్చిన తర్వాత జట్టులో అంతా మారిపోయింది." అని తన అనుభవాలను కార్తీక్ పంచుకున్నారు.
జట్టుకు అనుగుణంగా మారడమే అసలైన పాఠం
మహేంద్ర సింగ్ ధోనీ విజయవంతమైన తర్వాత.. దినేష్ కార్తీక్ జట్టులో కొనసాగడం కోసం అనేక సార్లు తన స్థానాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయంపై దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. "నేను ఒక ఊసరవెల్లిలా మారాను. జట్టులో ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంటే తమిళనాడు తరఫున ఓపెనింగ్ చేసేవాడిని, మిడిల్ ఆర్డర్ అవసరమైతే, అక్కడ బ్యాటింగ్ చేసేవాడిని. జట్టులో చోటు దక్కించుకోవడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే అసలైన సవాలుగా ఉండేది. ఒత్తిడిలో కొన్నిసార్లు నేను నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయాను" అని దినేష్ కార్తీక్ వివరించారు.
ఎంఎస్ ధోనీ తన ఆడే తీరుతో తనకు చాలా విషయాలు నేర్పించారని దినేష్ కార్తీక్ తెలిపారు. ధోనీ తనకు నేరుగా చెప్పకపోయినా ఆయన ఎంతో నేర్పాడని ఆయన చెప్పారు. ధైర్యం, ఓర్పు ఎంత ముఖ్యమో తాను తెలుసుకున్నట్లు వెల్లడించారు. కెరీర్ చివరి దశలో నంబర్ 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేశానని.. అది సులభం కాదని.. కానీ ఆ పాత్రకు అలవాటుపడ్డానని కార్తీక్ చెప్పుకొచ్చారు.
కార్తీక్ కెరీర్ కీలకాంశాలు
దినేష్ కార్తీక్ చివరిసారిగా 2022 టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు తరఫున ఆడారు. 2022 ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చారు. కార్తీక్ 2007 టీ20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో కూడా సభ్యుడు. ఆయన మొత్తం 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20 మ్యాచ్లు ఆడారు. 2018లో నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో చివరి బంతికి సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించడం ఆయన కెరీర్లో ఒక మరపురాని క్షణం.