లండన్ : కొనుగోలుదారులను అత్యంత ఎక్కువగా ఆకర్షించే క్రీడాకారుల జాబితాలో టీమ్ ఇండియా కెప్టెన్ ధోనీ టాప్ -10లో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో టెన్నిస్ సూపర్ స్టార్ రఫెల్ నాదల్ , బాస్కెట్ బాల్ స్టార్ కోబ్ బ్రయాంట్ లను వెనక్కినెట్టాడు. స్పోర్ట్స్ ప్రొ మ్యాగజైన్ ప్రకటించిన ఈ జాబితాలో ధోనీ పదో స్థానంలో నిలిచాడు. జమైకా పరుగు వీరుడు ఉసేన్ బోల్ట్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఫుట్ బాల్ తారలు క్రిస్టియానో రొనాల్డో మూడు, లియోనెల్ మెసి నాలుగో స్థానం సొంతం చేసుకున్నారు. క్రికెట్ ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ యువరాజ్ 49వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచకప్ తర్వాత ధోనీ విలువ అమాంతంగా పెరిగిపోయింది. భారత్ లో సచిన్ లా ధోనీ ప్రజాధరణ పొందకపోవచ్చు గానీ బ్రాండ్ విలువ పెంచుకోవాలనుకునే కంపెనీలకు తొలి ప్రాధాన్యత అతడే అని స్పోర్ట్స్ ప్రొ మ్యాగజైన్ పేర్కొంది. జాబితాలో టాప్ -10లో నిలిచిన ఏకైక మహిళా క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకి (టెన్నిస్ ). ఆమె తొమ్మిదో స్థానంలో ఉంది.