
వన్డే వరల్డ్ కప్లో తనను ఆడించాలని రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ బలంగా అనుకున్నారని టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ చెప్పాడు. ఈ కారణంగానే గతేడాది పూర్తిగా వన్డేలపై ఫోకస్ పెట్టించారని తెలిపాడు. రోహిత్ జట్టు పగ్గాలు అందుకున్నప్పుడే తనకు ఈ క్లారిటీ ఇచ్చారని వెల్లడించాడు. అయితే ఫామ్ కోల్పోవడంతో ధవన్ టీమిండియాలో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ధవన్ పెదవి విప్పాడు.
'రోహిత్కు కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత.. అతను, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ నాకు చాలా మద్దతు ఇచ్చారు. వరల్డ్ కప్ ఫోకస్గా ఆడాలని నాకు చెప్పారు. 2022లో నాకు వన్డేల్లో నిలకడగా అవకాశాలు కూడా వచ్చాయి' అని ధవన్ గుర్తుచేశాడు. కానీ టెస్టులు, టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న కుర్రాడు దూసుకొచ్చాడని, అదే సమయంలో తన ఫామ్ దెబ్బతిందని ధవన్ చెప్పాడు. ఒకటి, రెండు సిరీసుల్లో తన ఫామ్ పోవడంతో గిల్కు అవకాశం ఇచ్చారని, అతను ఈ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని స్పష్టం చేశాడు.
'మాకు ఇలాంటి పరిస్థితులు అలవాటే. బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ కొట్టినప్పుడు.. ఒక్క క్షణం పాటు నాకు జట్టులో ఇక చోటు దక్కదని అనిపించింది' అని ధవన్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సూపర్ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ కూడా కివీస్పై డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో తను భారత జట్టు సెలెక్టర్ అయినా సరే.. ధవన్ బదులు గిల్నే ఎంపిక చేస్తానని శిఖర్ వెల్లడించాడు.2023లో 9 ఇన్నింగ్సులు ఆడిన గిల్ 663 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
'శుభ్మన్ ఆడుతున్న విధానం చూస్తుంటే.. టెస్టులు, టీ20ల్లో అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎక్కువ అంతర్జాతీయ మ్యాచులు ఆడుతున్నాడు. అదే సమయంలో నేను ఆడటం లేదు. అలాంటప్పుడు నేను సెలెక్టర్ అయి ఉన్నా సరే.. ధవన్కు అవకాశం ఇచ్చేవాడిని కాదు. శుభ్మన్ గిల్నే సెలెక్ట్ చేసేవాడిని' అని ధవన్ తేల్చిచెప్పాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో కూడా రోహిత్కు జోడీగా గిల్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ధవన్ చెలరేగితే.. అతనికి మళ్లీ అవకాశం దొరికే ఛాన్స్ ఉంది.