
హైదరాబాద్: జనవరి 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. రెండు రోజుల క్రితం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ యువ ఆటగాళ్లకు ఇదొక గొప్ప అవకాశమని, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించాడు.
తాజాగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు కూడా యువ క్రికెటర్లకు తమ అనుభవాలను సలహాల రూపంలో పంచుకున్నారు. ఈ సందర్భంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ 'అండర్-19 వరల్డ్ కప్ యువ ఆటగాళ్లకు గొప్ప వేదిక. అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అనుభవం ముందే కలుగుతుంది' అని అన్నాడు.
'ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేసిన ఎంతో మంది ఆటగాళ్లు తమ దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో ఈ టోర్నీకి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మీరు ఒకసారి పరిశీలిస్తే ఆయా దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా మంది క్రికెటర్లు అండర్-19 క్రికెట్లో మంచి ప్రదర్శన చేసి ఉంటారు' అని ధావన్ అన్నాడు.

'అండర్-19 వరల్డ్ కప్ నాకు ఎన్నో మధుర స్మృతుల్ని మిగిల్చింది. 2004లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్లో నేను టాప్ స్కోరర్ని మాత్రమే కాదు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచా. ఇది నాలో ఆత్మవిశ్వాసం నింపి అనుభవజ్ఞుడైన సీనియర్ క్రికెటర్గా మలిచింది' అని ధావన్ చెప్పాడు.
రెండుసార్లు అండర్-19 వరల్డ్ కప్కు ప్రాతినిథ్యం వహించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాట్లాడుతూ 'ఈ టోర్నీ నేర్చుకునేందుకు సాయపడుతుంది. అంతర్జాతీయ క్రికెట్ను పరిచయం చేస్తుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో నేను సభ్యుడిని. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. ప్రస్తుతం విజయవంతమైన కెప్టెన్గా కోహ్లీ ఎలా రాణిస్తున్నాడో మీరూ చూస్తున్నారుగా' అని అన్నాడు.

చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ తన ఖాతాలో రెండు హ్యాట్రిక్లు ఉన్నాయని అన్నాడు. కుల్దీప్ యాదవ్ 2014 అండర్-19 వరల్డ్ కప్లో అద్భుత ప్రదర్శన చేశాడు. 'నా తొలి మ్యాచ్ పాక్పై ఆడాను. వికెట్ తీయలేకపోయా. ఆ తర్వాత స్కాట్లాండ్పై హ్యాట్రిక్ నమోదు చేశా. అది నా కెరీర్ను మలుపు తిప్పింది' అని కుల్దీప్ అన్నాడు.
'ఆ తర్వాతి మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శన చేశా. ప్రస్తుతం నా ఖాతాలో రెండు హ్యాట్రిక్లు ఉన్నాయి. ఒకటి అండర్-19లో సాధించా. రెండోది సీనియర్ క్రికెట్లో ఆస్ట్రేలియాపై నమోదు చేశా. ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ నమోదు చేస్తానని కలలో కూడా ఊహించలేదు. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఇది మంచి వేదిక. మంచి గుర్తింపు వస్తుంది' అని కుల్దీప్ అన్నాడు.
అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఐదు సార్లు ఫైనల్కు చేరగా... మూడు సార్లు టైటిల్ విజేతగా అవతరించింది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.