
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్లో భాగంగా మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు ఘన విజయం సాధించింది. 31 పరుగుల తేడాతో ముంబై జట్టును చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చాలా తక్కువ పరుగులు చేసి ముంబై టార్గెట్ను సులువు చేసింది. అయినా లక్ష్యాన్ని ఛేదించలేని ముంబై.. ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదింటిని ఓడిపోయింది. జట్టును గెలిపించడంలో మరోసారి రోహిత్ శర్మ ఫైయిలయ్యాడు.
సన్రైజర్స్ బ్యాట్స్మెన్స్ అంతగా ఆకట్టుకోలేకపోయినా బౌలర్లు మాత్రం అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరిచారు. రషీద్ ఖాన్, సిద్దార్థ్ కౌల్ తమ మాయాజాలంతో ముంబై బ్యాట్స్మెన్స్కు షాకిచ్చారు. ఐదో ఓవర్లో షకీబల్ బౌలింగ్లో రోహిత్ శర్మ ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ క్యాచ్ పట్టిన ఆనందంలో శిఖర్ ధావన్ తొడగొట్టి మరీ తన హర్షాన్ని వ్యక్తం చేశాడు. ధావన్ తొడగొట్టిన ఫొటో, వీడియో నెట్లో వైరల్గా మారాయి.
ధావన్, రోహిత్లు ఇద్దరూ కలిసి టీమిండియా ఓపెనర్లుగా దిగి పరుగుల వరద పారించగలరు. అలాంటిది రోహిత్ వికెట్ తీసిన ఆనందంలో ధావన్ అత్యంత ఉత్సాహంగా కనిపించాడు. రోహిత్ వికెట్ పడిన వెంటనే తొడకొట్టిన ధావన్ను.. గతంలోనూ ఇలా సెలబ్రేట్ చేసుకున్న సందర్భం గురించి ప్రశ్నించగా 'వీరత్వం చూపించాలంటే ఇలానే చేయాలి' అని బదులిచ్చాడు.
వరుసగా రెండు వైఫల్యాల అనంతరం ధావన్ రాకతో హైదరాబాద్ జట్టును మళ్లీ విజయం వరించింది. అత్యంత తక్కువ పరుగులను ముంబై ముందుంచిన సన్ రైజర్స్ జట్టు బౌలింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. కాగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 11 లోనే అతి తక్కువ స్కోరును రెండు సార్లు నమోదు చేసుకున్న జట్టుగా చెత్త రికార్డును మూట గట్టుకుంది.