
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. మిగతా ఫార్మాట్లలో ఘోరంగా ఫెయిలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో మూడు వన్డేల్లోనూ అతనికి అవకాశం ఇచ్చారు. కానీ ఒక్క మ్యాచ్లో కూడా సూర్య రాణించలేదు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ తొలి బంతికే గోల్డెన్ డక్గా పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అసలు టీ20 సక్సెస్ చూసి మిగతా ఫార్మాట్లలో ఎలా అవకాశాలు ఇస్తారని సెలెక్టర్లను ఫ్యాన్స్ నిలదీశారు.
అయితే సూర్యకుమార్కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని, అతను కచ్చితంగా రాణిస్తాడని కూడా కొందరు అంటున్నారు. ఈ జాబితాలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా చేరాడు. 'సూర్యకుమార్ యాదవ్ చక్కగా రాణిస్తున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లలో అతనొకడు. కొన్ని సిరీసుల్లో ఫెయిలవడం అనేది చాలా సహజం' అని ధవన్ అన్నాడు. ముఖ్యంగా సూర్యను ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో ఆడించడంపై బాగా విమర్శలు వచ్చాయి. దీనిపై కూడా ధవన్ మాట్లాడాడు.
'ఆ టెస్టు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. టెస్టు ఫార్మాట్లో వికెట్ చాలా భిన్నంగా ఉంటుంది. అదే బ్యాటర్కు పెద్ద సవాల్. మనం భారత్లో ఆడితే ఇక్కడ టీమిండియా గెలవడం కోసం టర్నింగ్ పిచ్లు తయారు చేస్తారు. అలాంటి సమయంలో ఎంత గొప్ప బ్యాటర్ అయినా సరే ఆడటం అంత ఈజీ కాదు. ఒక్క స్పిన్నర్లు అనే కాదు.. పేసర్ల కోసం తయారు చేసే గ్రీన్ పిచ్లపై ఆడటం కూడా కష్టమే. అందుకే టెస్టుల్లో రాణించాలంటే అనుభవం చాలా అవసరం' అని ధవన్ వివరించాడు.
అలాంటి పిచ్లపై చాల సవాళ్లు ఎదురవుతాయని, అక్కడ అనుభవం లేని ఆటగాళ్లు ఆడాల్సి వస్తే వాళ్లు రాణించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. మూడు, నాలుగు సార్లు విఫలమైనా కూడా ఆ తర్వాత తమ పొరపాట్ల నుంచి వాళ్లు చాలా నేర్చుకుంటారని, అప్పుడు తమ సత్తా చాటతారని మద్దతిచ్చాడు. అయితే చాలా మంది మాత్రం వన్డేల్లో వరుసగా విఫలం అవుతున్న సూర్యకు అన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు.. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ శాంసన్కు ఎందుకు అవకాశాలు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. దీనికి మాత్రం బీసీసీఐ నుంచి సమాధానం రావడం లేదు.