
బెంగళూరు: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్, సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రషీద్ ఖాన్ బౌలింగ్ను ఎదుర్కోవడం అంత సులువు కాదని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ అన్నాడు. రషీద్ ఒకే సమయంలో మంచి పేస్తో పాటు వైవిధ్యభరితమైన బంతుల్ని సంధిస్తాడన్నాడు. దేశం తరఫున ఆడటమే తన ముందున్న లక్ష్యమని పడిక్కల్ చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో పడిక్కల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి సీజన్లోనే 473 పరుగులు సాధించి బెంగళూరు జట్టులో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
తాజాగా దేవ్దత్ పడిక్కల్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'పేసర్లను ఎదుర్కోవడం కష్టతరంగా అనిపించలేదు. ఎందుకంటే దేశవాళీ క్రికెట్లో వేగవంతమైన కొంత మంది ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్లో ఆడాను. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్ సవాలుగా అనిపించింది. అతడు ఒకే సమయంలో మంచి పేస్తో పాటు వైవిధ్యభరితమైన బంతుల్ని సంధిస్తాడు. అతడిని ఎదుర్కొన్నప్పుడ. ఇప్పటి వరకు అలాంటి బంతుల్ని ఆడలేదన్న అనుభూతి కలిగింది. అతడి బౌలింగ్లో భారీ షాట్లు ఆడటం అంత సులువు కాదు' అని అన్నాడు.

తన ఆటపై మరింత దృష్టిపెట్టి భారత జట్టుకు ఎంపిక కావడానికి తీవ్రంగా కృషి చేస్తానని బెంగళూరు ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ పేర్కొన్నాడు. 'దేశం తరఫున ఆడటమే నా ముందున్న ప్రధానం లక్ష్యం. క్రికెటర్గా ప్రతి ఒక్కరి కల అది. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తాను. నా ఆటను మరింత మెరుగుపర్చుకుంటాను. అవకాశం వస్తే సత్తాచాటుతా' అని పడిక్కల్ వెల్లడించాడు. ఐపీఎల్లో తొలిసారి ఆడిన పడిక్కల్ ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు. 'ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు'ను కూడా సాధించాడు.
రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ బౌలింగ్లో ఆడడానికి మేటి బ్యాట్స్మన్ సైతం తడబడుతుంటారు. ఫాస్ట్ బౌలర్ల యాక్షన్ని పోలి ఉండే రషీద్.. అదును చూసి గూగ్లీని సంధింస్తాడు. దాంతో ప్రతి బంతికీ బ్యాట్స్మెన్.. లెగ్ స్పిన్ అవుతోందా లేదా గూగ్లీ పడిందా అనే డబుల్ మైండ్లో ఆడాల్సి వచ్చేది. ఐపీఎల్ 2020 సీజన్లో 15 మ్యాచ్లాడిన రషీద్.. 20 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ఎకానమీ ఓవర్కి 5.37గా ఉంది.