ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ కొత్త కార్యదర్శిగా దేవజిత్ సైకియా బాధ్యతలు చేపట్టారు. ఐసీసీ ఛైర్మన్గా జై షా ఎంపికయ్యాక, ఇప్పటివరకు తాత్కాలిక కార్యదర్శిగా వ్యవహరించిన సైకియా... ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు.
అస్సోం నుంచి జర్నీ స్టార్ట్
ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి సైకియా క్రికెట్ జర్నీ ప్రారంభమైంది. కొంత కాలం పాటు దేశవాళ్లీ క్రికెట్ లో ఆడారు. 1990-91 మధ్య అసోం తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా రాణించారు. 59 పరుగులు చేశారు. 9 స్టంపౌట్ లు చేశారు. 28 ఏళ్ల వయసులో గౌహతి హైకోర్టులో లాయర్ గానూ పని చేశారు. ఆ తర్వాత బోర్డు అధికారిక కార్యకలపాల్లో చురుకుగా పాల్గొనడం ప్రారంభించారు. ముఖ్యంగా జై షా బోర్డు కార్యదర్శిగా ఎంపికయ్యాక సైకియాకు ప్రాధన్యత ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తన వారసుడిగా సైకియాకు జై షానే ఎంపిక చేశారనే ప్రచారం కూడా సాగింది.

సైకియా ముందు సవాళ్లు
మూడు ఫార్మాట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే టీమిండియా.. గత కొద్ది రోజులుగా వన్డే, టెస్టుల్లో సతమతమవుతోంది. పేలవ ప్రదర్శన చేస్తూ విమర్శలను ఎదుర్కొంటోంది. శ్రీలంకపై వన్డే సీరీస్ కోల్పోవడంతో భారత జట్టు పతనం మొదలైంది. ఆ తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాట్, అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో సిరీస్ కోల్పోవడం, ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించడం.. తదితర కారణాలతో భారత జట్టుపై తీవ్రంగా విమర్శలు పెరిగిపోయాయి. దీంతో జట్టును మళ్లీ తిరిగి గాడినపెట్టడం, ఇంకా సీనియర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యాన్ని తేల్చడం సహా కొత్త కెప్టెన్ ను ఎంచుకోవడం, స్టార్ పేసర్ బుమ్రాకు దీటైనా బౌలర్ ను తయారు చేయడం లాంటి సవాళ్లెన్నో సైకియా ముందున్నాయి. చూడాలి మరి వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటారనేది.