లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్లో అసలు సిసలు మజా ఇప్పుడిప్పుడే ఆరంభమైంది. లీగ్ దశలో మ్యాచ్లు ముగింపుకొచ్చినప్పటికీ.. సెమీ ఫైనల్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. ఒక్క ఆస్ట్రేలియా మాత్రమే సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో సమవుజ్జీ జట్లయిన భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ టీమ్లకు ఇంకా సెమీఫైనల్లో ప్రవేశించే అదృష్టం దక్కలేదు.
సెమీ ఫైనల్కు చేరుకోవాల్సినవి మూడు జట్లే అయినప్పటికీ.. నాలుగైదు టీమ్లు దీనికోసం కాపుగాశాయి. ఈ పరిస్థితుల్లో టీమిండియా మరి కొన్ని గంటల్లో బలమైన ఇంగ్లండ్ జట్టును ఎదుర్కొనబోతోంది.

ఇంగ్లీష్ టీమ్కు జీవన్మరణ సమస్య: ప్రస్తుతం పీకల్దాకా ఒత్తిడిలో ఉన్న జట్టు ఏదైనా ఉందంటే అది ఇంగ్లండ్ టీమ్ ఒక్కటే. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అయిదో స్థానానికి దిగజారింది. ఆడిన ఏడింట్లో మూడు మ్యాచ్లను చేజార్చుకుని, తనకు పోటీగా వేరే జట్లకు సెమీ ఫైనల్కు వెళ్లే అవకాశాలను కల్పించింది.
వరుసగా మూడు మ్యాచ్లలో విజృంభించి ఆడిన పాకిస్తాన్ గ్రీన్ ఆర్మీ.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడంతో.. ఇంగ్లండ్ను సైతం వెనక్కి నెట్టేసింది సర్ఫరాజ్ సేన. తొమ్మిది పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టుకు ఒక్క మ్యాచే మిగిలి ఉంది. అదీ బంగ్లాదేశ్తో. గట్టిగా పోరాడితే పాకిస్తాన్ ఆ మ్యాచ్లో గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇంగ్లండ్ చేతిలో రెండు మ్యాచ్లు ఉన్నప్పటికీ: పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇంగ్లండ్ ఇంకా రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఒకటి టీమిండియాతో, మరొకటి న్యూజిలాండ్తో. నిజానికి- ఈ రెండు జట్లూ ఇంగ్లండ్తో సమవుజ్జీలుగా ఉన్నవే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండూ గెలిస్తేనే ఇంగ్లండ్ సెమీ ఫైనల్కు వెళ్లే యోగం పడుతోంది లేదంటే హుష్కాకే. మెరుగైన రన్రేట్ కారణంగా పాకిస్తాన్ ముందడుగు వేయగలుగుతుంది. భారత్తో మ్యాచ్లో ఇంగ్లండ్ గనక ఓడితే.. ఇంగ్లండ్ పని ఖల్లాస్. తన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
మూడు జట్లకు ఛాన్స్: టీమిండియాతో మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడిపోతే.. మూడు జట్లకు సెమీఫైనల్కు వెళ్లే అవకాశం దొరికినట్టవుతుంది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సైతం సెమీ ఫైనల్ అవకాశాలను మెరుగు పర్చుకోగలుగుతాయి. ఇంగ్లండ్తో మ్యాచ్ను వదిలేస్తే.. టీమిండియా ఇంకా రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉంటుంది. శ్రీలంక, బంగ్లాదేశ్లతో మ్యాచ్లో ఒక్కటి గెలిచినా కోహ్లీసేన సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. ఇంగ్లండ్పై గెలిచి.. ఆ రెండు మ్యాచ్లనూ భారత్ కోల్పోయినప్పటికీ.. మెరుగైన రన్రేట్తో సెమీఫైనల్కు వెళ్లగలుగుతుంది.
ఇంగ్లండ్ గెలిస్తే: భారత్తో మ్యాచ్లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించగలిగితే.. సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఇంగ్లండ్ నేరుగా సెమీ ఫైనల్ బెర్త్ను దక్కించుకుంటుంది. ఇక పోటీ భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్యన ఉంటుంది. పాకిస్తాన్తో పోల్చుకుంటే భారత్, న్యూజిలాండ్ జట్లు మెరుగైన రన్రేట్తో ఉన్నందున పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండదు.
ఎటొచ్చీ- పాకిస్తాన్ పక్కకెళ్లిపోతుంది. పాకిస్తాన్కు మిగిలి ఉన్నది ఒకే ఒక్క మ్యాచ్. బంగ్లాదేశ్తో ఆ మ్యాచ్ గెలిచినప్పటికీ.. 11 పాయింట్లు ఉంటాయి. ఇప్పటికే న్యూజిలాండ్, భారత్ 11 పాయింట్లను అందుకున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గెలిస్తే.. పాకిస్తాన్కు దారులు దాదాపుగా మూసుకుపోయినట్టే. ప్రస్తుతం ఇంగ్లండ్ ఎనిమిది పాయింట్లతో అయిదో స్థానంలో కొనసాగుతోంది. భారత్తో మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్లను సాధిస్తుంది.