హైదరాబాద్: గత కొన్నేళ్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ విజయ రహస్యం అతని కఠోరశ్రమ, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడమేనని క్రికెట్ విశ్లేషలుకు అంటుంటే, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మాత్రం అదంతా తన గొప్పతనమేనని చెప్పారు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ కావడానికి తానే కారణమని డేరా బాబాగా పిలువబడే గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అన్నారు. బాలీవుడ్ వెబ్సైట్ గాసిప్ బ్లాగ్ స్పాట్ బాయికి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
'అతడు (కోహ్లీ) మొదట్లో మంచి ఆరంభాలను భారీ స్కోరులుగా మలచలేకపోయాడు. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలని, నేర్చుకోవడం కొనసాగించాలని అప్పుడు కోహ్లీకి సలహాయిచ్చాను. అప్పటి నుంచి అతడు బాగా రాణిస్తున్నాడు' అని డేరా బాబా అన్నారు.

28 ఏళ్ల కోహ్లీ టీమిండియా జట్టుకు ఎంపికైన తర్వాత తనకు థ్యాంక్స్ చెప్పాడని కూడా వెల్లడించారు. కాగా, ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో కోహ్లీ డబుల్ సెంచరీ (204) సాధించాడు. తద్వారా వరుసగా నాలుగు టెస్టు సిరీస్ల్లో డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
అంతక ముందు వెస్టిండిస్పై 200, న్యూజిలాండ్పై 211, ఇంగ్లాండ్పై 235 ఇలా వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలను కోహ్లీ అధిగమించాడు. డాన్ బ్రాడ్మన్, రాహుల్ ద్రవిడ్లు మాత్రమే వరుసగా మూడు సిరిస్లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు.