
హైదరాబాద్: 4,6,4,2,6,6,0,4,2,1 సోమవారం దేవధర్ ట్రోఫీ పైనల్లో భాగంగా ఇండియా-బి ఆటగాడు ఆల్రౌండర్ కృష్ణప్ప గౌతమ్ ఆడిన పది బంతుల్లో చేసిన పరుగులివి. రాంచీలోని జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇండియా-సి జట్టుతో జరిగిన పైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
10 బంతుల్లోనే మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వరుస బంతుల్లో(4,6,4,2,6,6,0,4,2,1) బౌండరీలు బాదాడు. 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసిన దశలో క్రీజులోకి వచ్చిన గౌతమ్ తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాడు.
ఇండియా-సి బౌలర్ దివేశ్ పఠానియా వేసిన 49 ఓవర్లో ఏకంగా 31 పరుగులు పిండుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇండియా-బి జట్టులో కేదార్ జాదవ్ (86; 94 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), యశస్వి జైశ్వాల్ (54; 79 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక, ఇండియా-సి జట్టు బౌలర్ ఇషాన్ పోరెల్ 10 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసి 43 పరుగులిచ్చాడు. లిస్ట్-ఎ క్రికెట్లో ఇషాన్ పోరెల్కు ఇది రెండో ఐదు వికెట్లు హాల్ కావడం విశేషం.
అనంతరం 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-సి జట్టుకు ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద ఇండియా-సి కెప్టెన్ శుభమాన్ గిల్(1)ను పెవిలియన్కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రియమ్ గార్గ్ (74; 77 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28; 31 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడు ఆడే క్రమంలో జట్టు స్కోరు 56 పరుగుల వద్ద షాబాజ్ నదీమ్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఇండియా-సి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఇండియా-సి జట్టు 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.