
హైదరాబాద్: ఇంగ్లాండ్ పిచ్లపై భారత కుర్రాళ్లు బోల్తా పడ్డారు. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన నాలుగు రోజుల అనధికార టెస్టు మ్యాచ్లో ఇండియా-ఎ జట్టు 254 పరుగుల తేడాతో భారీ ఓటమి పాలైంది. 421 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా-ఎ రెండో ఇన్నింగ్స్లో 44 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది.
ఓవర్నైట్ స్కోరు 11/3తో గురువారం ఆటను కొనసాగించిన ఇండియా-ఎ ఇంగ్లాండ్ బౌలర్లు పోర్టర్ (2/43), కురన్ (2/17), బెస్ (2/43) ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. భారత బ్యాట్స్మెన్లలో రిషబ్ పంత్ (61), రహానె (48), జయంత్ యాదవ్ (21) పోరాడినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.

ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ (13), మురళీ విజయ్ (0)లు తీవ్రంగా నిరాశపర్చారు. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి లంచ్ విరామ సమయానికే టీమిండియా 115 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత యువ ఆటగాడు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, సహచరుల నుంచి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో పోర్టర్, కుర్రాన్, బెస్ తలా రెండు వికెట్లు తీశారు. నాలుగు రోజుల అనధికార టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 423 పరుగులు చేయగా.. భారత్ 197 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 194/5 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.