మొహాలీ: తమ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ ఉండటం ఆనందంగా ఉందని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దక్షిణాఫ్రికాతో గురువారం నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడాడు. బ్యాట్సుమెన్ కంటే ఎప్పుడు బౌలర్లే కీలకమని చెప్పాడు.
తాము ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతామని కోహ్లీ హింట్ ఇచ్చాడు. ఆరుగురు బ్యాట్సుమెన్, ఒక వికెట్ కీపర్తో బరిలోకి దిగితే ఎక్కువ పరుగులు చేసినప్పటికీ, వికెట్ తీసేందుకు తక్కువ బౌలర్లు ఉంటే ఫలితం ఉండదని అభిప్రాయపడ్డాడు.
ఈ నేపథ్యంలో మొదటి స్థానంలో వచ్చే అయిదుగురు బ్యాట్సుమెన్ చాలా కీలకం అన్నాడు. పరుగులు చేయడంలో వారిదే బాధ్యత అన్నాడు. వికెట్ కీపర్తో కలిసి ఆరుగురు బ్యాట్సుమెన్ అవుతామని చెప్పాడు. ఆల్ రౌండర్ కూడా ఉంటాడని చెప్పాడు.

మ్యాచ్లో బౌలర్స్ రోల్ చాలా ముఖ్యమని చెప్పాడు. అశ్విన్ ఉండటం ఆనందమన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోను అద్భుతమైన బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్లలో అశ్విన్ ఒకరు అని చెప్పాడు. అతను ఐదారు వికెట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయన్నాడు. ఆటను మార్చే శక్తి అశ్విన్కు ఉందని కితాబిచ్చాడు.
శ్రీలంకతో జరిగిన సిరీస్లో అశ్విన్ సత్తా చాటాడన్నాడు. తద్వారా ప్రపంచంలోని టాప్ ఇద్దరు ముగ్గురు స్పిన్నర్లలో తాను ఉన్నాడని నిరూపించుకున్నాడని చెప్పాడు. అతనికి విశ్వాసం ఎక్కువ అన్నాడు. మ్యాచ్ విన్నర్ అని చెప్పాడు. అతను తమకు ముఖ్యమైన బౌలర్ అని చెప్పాడు.
తమ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వంటి బౌలర్ ఉన్నందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. కాగా, కోహ్లీ గురువారం నాడు తన 27వ పుట్టిన రోజును జరుపుకోనున్నాడు. దీని పైనా అతను స్పందించాడు.
తాను స్వదేశంలో తన పుట్టిన రోజు నాడే తొలి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. రేపు నాకు చాలా స్పెషల్ డే అన్నాడు. ఒకటి రేపు స్వదేశంలో కెప్టెన్గా తొలిసారి బరిలోకి దిగడం, రెండోది తన పుట్టిన రోజు అన్నాడు. ఇది తనకు డబుల్ ఎగ్జైట్మెంట్ అన్నాడు.