
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య నేడు మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ జరగనుంది. ఢిల్లీకి ఇది చాలా కీలకమైన మ్యాచ్. లక్నో కూడా ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఇకపోతే లక్నో సూపర్ జెయింట్స్ టీం ఐపీఎల్-2022 సీజన్లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు లక్నో టీం ఆడిన తొమ్మిది మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించి.. 12పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక ఢిల్లీ ఆడిన 8 మ్యాచ్ల్లో 4మ్యాచ్లు గెలిచి 6వ స్థానంలో కొనసాగుతుంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై లక్నో 20పరుగుల తేడాతో విజయం సాధించి ఉత్సాహంతో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం గత మ్యాచ్లో కేకేఆర్ను ఓడించి మళ్లీ పికప్ అందుకుంది. ఈ క్రమంలో నేటి మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రాహుల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
టాస్ గెలిచిన రాహుల్ మాట్లాడుతూ.. 'ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మంచి వికెట్గా కనిపిస్తోంది. మంచి స్కోరు చేసి దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. గత మ్యాచ్లో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని మేము నిజాయితీగా చర్చించుకున్నాం. ఒత్తిడిలో కొన్ని తప్పులు జరగడం కామన్.. వాటిని మా ప్లేయర్లు అంగీకరించి సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో అవేష్ ఖాన్కు బదులుగా క్రిష్ణప్ప గౌతమ్ బరిలోకి దిగుతున్నాడు.' అని పేర్కొన్నాడు. పంత్ మాట్లాడుతూ.. తాము గత మ్యాచ్ టీంనే కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్