హైదరాబాద్: ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు ఐసీసీ దృష్టికి వెళ్లింది. గాలి కాలుష్యం కారణంగా శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖాలకు మాస్క్లు ధరించి ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ టెస్టు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఢిల్లీ టెస్టులో రెండో రోజు నుంచే గాలిలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తాము ఆడలేమని చెప్పినా, నిబంధనల ప్రకారం మ్యాచ్ నిలిపివేయడం కుదరదని అంపైర్లు తేల్చిచెప్పడం తప్పనిసరి పరిస్థితుల్లో లంక ఆటగాళ్లు మాస్క్లు ధరించి ఆడారు.
ముఖ్యంగా బౌలింగ్ వేసే సమయంలో ఇరు జట్లకు చెందిన బౌలర్లు సురంగ లక్మల్, మహమ్మద్ షమీలు మైదానంలోనే వాంతి చేసుకున్నారు. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మ్యాచ్ని కొనసాగించడంపై అంతర్జాతీయంగా ఢిల్లీ టెస్టుపై చర్చ జరుగుతోంది.
దీనిపై శ్రీలంక క్రీడాశాఖ మంత్రి ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై ఐసీసీ ఢిల్లీ కాలుష్యంపై నివేదికను కోరింది. వైద్య నిపుణుల ఆ మ్యాచ్ పరిస్థితిపై నివేదిక ఇవ్వనున్నారు. గాలి కాలుష్యమైన పరిస్థితుల్లో మ్యాచ్ను నిర్వహించడం ఎంత వరకు సమంజసమని వైద్య నిపుణులు ఐసీసీకి వెల్లడించనున్నారు.
ఆ నివేదిక అనంతరం ఐసీసీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇరు జట్ల బౌలర్లు వాంతులు చేసుకుంటున్నా.. మ్యాచ్ను నిలిపివేయకుండా కొనసాగించడం పట్ల కూడా ఐసీసీ ఓ నిర్ణయాన్ని తీసుకోనుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే క్రికెట్ ఆడాలా వద్దా అన్న అంశంపై ఐసీసీ ప్రతినిధులు ఫిబ్రవరిలో జరిగే సమావేశంలో చర్చించనున్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.