న్యూఢిల్లీ: ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్కు ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఊరట లభించలేదు. 2013 ఐపిఎల్ 6 స్పాట్ ఫిక్సింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో దీనిపై స్పందనలను తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లతో పాటు మరో 33 మందికి నోటీసులు జారీ చేసింది.
స్పాట్ ఫిక్సింగ్ కేసులో ట్రయల్ కోర్టు 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. నగర పోలీసులు దాన్ని సవాల్ చేయడంతో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ్ మృదుల్ వారికి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన అపీల్ రికార్డులను కూడా తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

తగిన సాక్ష్యాధారాలను సమర్పించడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని ట్రయల్ కోర్టు అభిప్రాయపడింది. మోకా కింద వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 365 మందిపై మోపిన అభియోగాలను ట్రయల్ కోర్టు కొట్టేసింది.
ఆ 36 మందిలో శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్లతో పాటు బుక్కీలు కూడా ఉన్నారు. దావూద్, అతని అనుచురుల ఆధ్వర్వంలోని గ్యాంగ్ నడిపే సిండికేట్కు, వారికి మధ్య సంబంధాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నిరూపించలేకపోయిందని కోర్టు అభిప్రాయపడింది.