
ఐపీఎల్ని బ్యాన్ చేసిన ఢిల్లీ:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విషయంలో పలు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఐపీఎల్ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఐపీఎల్ని బ్యాన్ చేయడంతో పాటు టిక్కెట్ల అమ్మకాలను కూడా నిషేదించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఐపీఎల్ని బ్యాన్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

ఢీల్లీలో ఎటువంటి క్రీడా కార్యక్రమాలు ఉండవు:
స్పోర్ట్స్, మీటింగ్స్, కాన్ఫరెన్స్ కార్యక్రమాలన్నింటిని రద్దు చేస్తున్నట్టు ఢిల్లీ హెల్త్ సెక్రటరీ పద్మిని సింగ్లా ఓ ప్రకటనలో తెలిపారు. 'ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్న ప్రాణాంతక కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఒక నెల పాటు ఢీల్లీలో ఎటువంటి క్రీడా కార్యక్రమాలు జరుగవు' అని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం మీడియాతో చెప్పారు. దీంతో బీసీసీఐకి మరో షాక్ తగిలింది.

ప్రత్యామ్నాయ వేదిక లక్నో?:
ఢిల్లీలో తాజాగా మరో పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవల ఫ్రాన్స్, చైనాకి వెళ్లి వచ్చిన వ్యక్తిని టెస్ట్ చేయగా.. పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో మొత్తం 6 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ని బ్యాన్ చేసింది. అయితే బీసీసీఐ ప్రత్యామ్నాయ వేదికలను ఏర్పాటు చేస్తుందని సమాచారం తెలుస్తోంది. లక్నో స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్ జట్టు తన మ్యాచ్లను ఆడనుందని సమాచారం.

ప్రేక్షకుల్లేకుండానే ఈ సీజన్:
ఈ నెల 14న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ.. ఇప్పుడున్న 'కరోనా మహమ్మారి' దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. ప్రేక్షకుల్లేకుండానే ఈ సీజన్ జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications

