
హైదరాబాద్: ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ప్రాతినిధ్యం వహిస్తోన్న భారత ఆటగాళ్లందరూ తాజాగా అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ఏటా సుమారు వెయ్యి మంది మాత్రమే అవయవదానం చేస్తున్నారు. ఏటా సుమారు 5 లక్షల మంది సరైన సమయంలో అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ సందర్భంగా గౌతమ్ గంభీర్, పృథ్వీ షా తదితర ఆటగాళ్లు తాము అవయవదానం చేస్తున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. 'ప్రతి ఒక్కరు అవయవదానం చేయండి. నేను అవయవదానం చేశాను. ఈ దానం వలన మరొకరికి మెరుగైన జీవితం అందుతోంది. మనం జీవితంలో ఇంతకన్నా గొప్ప దానం మనం చేయగలమా. ఈ కార్యక్రమంలో భాగమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా కూడా తప్పకుండా ఇందులో భాగమవ్వండి' అని గంభీర్ కోరాడు.
'అవయవదానమనేది మరో మనిషి ప్రాణం కాపాడేందుకు ఉపయోగపడుతోంది. మరణాంతరం కూడా వేరే వాళ్లు బతికేందుకు సహాయపడుతోంది. ఈ పని చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను' అని గౌతం గంభీర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో 'స్పిరిట్ ఆఫ్ గివింగ్' పేరిట అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ డేర్డెవిల్స్ యాజమాన్యం నడుం బిగించింది.
కోల్కతా జట్టు కెప్టెన్సీ విడిచిపెట్టి ఈ ఏడాది ఐపీఎల్లో ఆరంభంలో ఢిల్లీ డేర్డెవిల్స్కు నాయకత్వం వహించిన గంభీర్ ఆ తర్వాత జట్టు వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ప్రస్తుతం ఢిల్లీ జట్టు ఆడుతోంది. కొత్త కెప్టెన్ అధినాయకత్వంలో ఒక్కసారి మాత్రమే గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 6పాయింట్లతో ఆఖరి నుంచి మొదటి స్థానంలో ఉంది.