
హైదరాబాద్: భారత మహిళా క్రికెటర్ నేహా తన్వర్ చివరిసారిగా జులై 2011లో బరిలోకి దిగింది. ఆ తర్వాత ఓ అబ్బాయికి జన్మనిచ్చిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. భారత 'ఎ' మహిళల జట్టు తరఫున ఎంపికైన నేహా తన్వర్ బంగ్లాదేశ్ 'ఎ' జట్టుతో వన్డే, టి20 సిరీస్ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన నేహా ఆరేళ్ల (2011) క్రితం భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున వెస్టిండీస్పై అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఆ ఏడాది ఐదు వన్డేలు, రెండు టీ20ల్లో కనిపించింది. విజ్డన్ ఇండియా ప్రకారం 18 ఏళ్ల వయసులోనే ఢిల్లీ సీనియర్ జట్టులో ఆమె చోటు దక్కించుకుంది.
2014లో క్రికెట్కు వీడ్కోలు పలికిన నేహా ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఆటకు పూర్తిగా దూరమైంది. అక్టోబర్లో ఓ పండటి బిడ్డకు జన్మనిచ్చిన 31 ఏళ్ల నేహా పుత్రోత్సాహంతో పూర్తిగా ఇంటికే పరిమితమైంది. కానీ క్రికెట్ ఆడాలన్న ఆశ చావకపోవడంతో మళ్లీ బ్యాట్ పట్టాలని నిర్ణయించుకుంది.
డాక్టర్ల సలహాతో కాన్పు జరిగిన ఆరు నెలల తర్వాత మెల్లగా నెట్స్లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. అయితే కాన్పు సమయంలో ఆమె పోషకాహారం తీసుకోవడం వల్ల బరువు బాగా పెరిగింది. బరువు పెరగడం మొదట్లో కాస్తంత ఇబ్బంది పడింది. అయితే ఆ తర్వాత ఫిట్నెస్పై దృష్టి సారించింది.
62 కేజీల నుంచి ప్రెగ్నెన్సీ సమయంలో 80 కేజీలకి చేరిన ఆమె ఆ తర్వాత ఫిట్నెస్పై దృష్టి సారించడంతో తిరిగి పూర్వస్థాయికి వచ్చేసింది. దీంతో తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్తో జరిగే సిరిస్కు ఎంపికైన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ 'నా భర్త సహకారం వల్లే మళ్లీ బరిలోకి దిగుతున్నాను. మాతృత్వం వరమే. మహిళలకు అది పునర్జన్మ. అమ్మతనం అన్నీ మార్చేస్తుంది. జీవితంలో ప్రాధాన్యతలు మారిపోతాయి. కానీ కొన్ని విషయాలే ఎప్పటికీ మారవు. సాధించాలను కుంటే సాధ్యం కానిదేదీ ఉండదు' అని తెలిపింది.
స్వదేశంలో బంగ్లాదేశ్ 'ఎ'తో జరిగే వన్డే, టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే భారత 'ఎ' జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రెండు ఫార్మాట్లలో అనూజా పాటిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆల్రౌండర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 జట్లలో చోటు దక్కించుకుంది.
21 ఏళ్ల మేఘన ఇప్పటివరకు భారత్ తరఫున 6 టీ20ల్లో ఆడింది. కాగా... డిసెంబరు 2, 5, 7వ తేదీల్లో జరిగే మూడు వన్డేలకు హుబ్లీ ఆతిథ్యం ఇస్తుండగా.. 12, 14, 16వ తేదీల్లో జరిగే మూడు టి20 మ్యాచ్లకు బెల్గామ్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికి ముందు నవంబర్ 26, 28వ తేదీల్లో అలూర్లో బంగ్లాదేశ్ 'ఎ' జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.