క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ హీట్ మొదలైంది. రోహిత్ శర్మకు కాదని హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ను తప్పించడంపై అతని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్ను ట్విటర్లో 4 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది అన్ఫాలో చేశారు. అయితే రోహిత్ కెప్టెన్సీ వీడటంపై కారణాలున్నాయంటూ వస్తున్న వార్తలు షాకింగ్గా ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను ముంబయి ఇండియన్స్ బదిలీ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ముంబయికి వచ్చే ముందు హార్దిక్ తన కెప్టెన్సీ గురించి క్లారిటీగా మాట్లాడుకున్నడాని తెలుస్తోంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబయికి కెప్టెన్ హార్దిక్ పాండ్య అని, వన్డేప్రపంచకప్ జరిగే టైమ్లోనే రోహిత్కు ఈ విషయాన్ని ముంబయి ఫ్రాంచైజీ తెలియజేసిందని సమాచారం.

అయితే గుజరాత్తో ముంబయి చర్చలు సాగిస్తున్నప్పుడే.. రోహిత్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నాలు చేసిందని తెలుస్తోంది. హిట్మ్యాన్ కోసం దిల్లీ తీవ్రంగా ప్రయత్నించగా కాంట్రాక్ట్ డీల్ కారణంగా అది కుదరలేదని సమాచారం. మరోవైపు రోహిత్కు ముంబయి తరపున 2024 సీజనే ఆఖరిదని వార్తలు వస్తున్నాయి.
2025 సీజన్ ముందు మెగా వేలం ఉంటుంది. ప్రతి జట్టు నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్. ఈ నేపథ్యంలో ముంబయి హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాను అట్టిపెట్టుకుని రోహిత్ను వదిలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మెగా వేలంలో రోహిత్ ఉంటాడని కథనాలు వస్తున్నాయి. కాగా, ఐపీఎల్ మినీ వేలం దుబాయ్ వేదికగా డిసెంబర్ 19న జరగనుంది.