ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు బోణీ కొట్టని జట్లు అంటూ ఏవైనా ఉన్నాయంటే అవి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్లు కూడా ఆడిన మ్యాచ్ లన్నీ ఓడిపోయాయి. చెన్నై మూడు, గుజరాత్ రెండింట్లో పరాజయం పాలయ్యాయి. తమ ప్రత్యర్థులకు రెండేసి చొప్పున పాయింట్లను ధారదాత్తం చేశాయి. ఈ వరుస ఓటములు చెన్నై సూపర్ కింగ్స్ ను మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. హేటర్స్ కు ట్రోలింగ్ స్టఫ్ ను అందించాయి.
ఈ పరిస్థితుల మధ్య ఈ రెండు జట్లనూ ఎదుర్కొనబోతోంది ఢిల్లీ కేపిటల్స్. దెబ్బతిన్న పులుల్లా ఉన్న గుజరాత్, చెన్నైతో ఈ నెల 8, 11 తేదీల్లో మ్యాచ్ లను ఆడాల్సి ఉంది. 18న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టబోతోంది. ఇప్పుడీ మూడు మ్యాచ్ లకు కూడా స్టార్ పేస్ బౌలర్ మిఛెల్ స్టార్క్ దూరం అయ్యాడు. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ నెగ్గి దూకుడు మీదున్న ఢిల్లీ కేపిటల్స్.. తన జైత్రయాత్రను కొనసాగించాలంటే స్టార్క్ అవసరం ఎంతైనా ఉంది.

ఈ స్టార్ ఆటగాడు మరో మూడు మ్యాచ్లకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. భుజం, మోచేతి గాయాల నుంచి ఆస్ట్రేలియాలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అక్కడే కోలుకుంటోన్నాడు. ఇప్పటివరకు జట్టుతో కలవలేదు కూడా. అత్యంత కీలకమైన ఈ మూడు మ్యాచ్ లకూ ఈ స్టార్ బౌలర్ సేవలను జట్టు కోల్పోనుంది. మిచెల్ స్టార్క్ ఈ సీజన్లో ఏదో ఒక సమయంలో జట్టుతో చేరతాడని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆశాభావంతో ఉంది.
ఈ ఎడమచేతి వాటం బౌలర్ లేనప్పటికీ అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. బౌలింగ్ యూనిట్ అద్భుత ప్రదర్శన చేసింది. ముఖేష్ కుమార్, లుంగి ఎన్గిడి, టీ నటరాజన్ కీలక ఓవర్లలో కచ్చితత్వంతో బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, విప్రజ్ నిగమ్ వంటి స్పిన్నర్లు మిడిల్ ఓవర్లల్లో సత్తా చాటుతున్నారు. చెన్నై, గుజరాత్, బెంగళూరుతో ఆడాలంటే మాత్రం అదనపు బౌలింగ్ వనరులు తప్పనిసరి.
ఈ పరిస్థితుల్లో స్టార్క్ జట్టులో చేరితే బాగుంటుందని ఆశించింది గానీ, అది సాధ్యపడేలా లేదు. గాయంతో ఉన్నప్పటికీ స్టార్క్ జట్టు యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నాడు. ప్రస్తుతం భుజం, మోచేతికి అయిన గాయం నుంచి కోలుకుంటున్నానని, వీలైనంత త్వరగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరడానికి కట్టుబడి ఉన్నానని స్టార్క్ స్పష్టం చేశాడు. ఈ సీజన్ ప్రారంభంలో అందుబాటులో లేనందుకు అభిమానులకు క్షమాపణ సైతం చెప్పాడు.