ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించింది. ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు.
అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రిటెన్షన్ లిస్ట్ను దాదాపుగా ఖరారు చేసింది. నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుని, ఇద్దరు యువ విదేశీ ప్లేయర్లను ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి దక్కించుకోవాలని ప్రణాళిక చేస్తోంది. విధ్వంసకర బ్యాటర్గా, వికెట్ కీపర్గా, కెప్టెన్గా తన ఉనికితో జట్టుకు విలువను పెంచే రిషభ్ పంత్ను రిటెన్షన్ లిస్ట్లో తమ ప్రథమ ఎంపికగా నిర్ణయించింది. ఇక స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను రెండో ఎంపికగా ఖరారు చేసింది.
అక్షర్ పటేల్ బ్యాటు, బంతితో పాటు అత్యుత్తమ ఫీల్డర్గా సత్తాచాటగలడు. ఇక మూడో రిటెన్షన్ ప్లేయర్గా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఢిల్లీ ఫ్రాంచైజీ తీసుకోనుంది. అయితే అన్క్యాప్డ్ ప్లేయర్గా యువ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ను రిటైన్ చేసుకోవాలని ఢిల్లీ భావిస్తోంది. గత సీజన్లో అభిషేక్ 32.70 సగటుతో, 159 స్ట్రైక్రేటుతో 327 పరుగులు చేశాడు. వికెట్ కీపింగ్తో పాటు హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉండే అభిషేక్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ రూ.4 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది. ఇక విదేశీ ప్లేయర్లు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, ట్రిస్టన్ స్టబ్స్ను ఆర్టీఎమ్తో దక్కించుకోవాలని ఫ్రాంచైజీ భావిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్ (అంచనా)
రిషభ్ పంత్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ పోరెల్ (అన్క్యాప్డ్), జేక్ఫ్రేజర్ మెక్గర్క్ (ఆర్టీఎమ్), ట్రిస్టన్ స్టబ్స్ (ఆర్టీఎమ్).