
ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, ప్లేయర్ శార్దూల్ ఠాకూర్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తనపై ఐపీఎల్ నిర్వాహక యాజమాన్యం సీరియస్ అయింది. టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఈ ముగ్గురికి పనిష్మెంట్ విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు అతని మ్యాచ్ ఫీజులో 100శాతం జరిమానాను విధించింది. పంత్ ప్రవర్తనను లెవల్ 2నేరంగా పరిగణించిన ఐపీఎల్.. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.7ప్రకారం ఈ ఫైన్ వేసింది.
ఈ పనిష్మెంట్ను పంత్ అంగీకరించాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన శార్దూల్ ఠాకూర్ సైతం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50శాతం జరిమానా విధించింది. ఆర్టికల్ 2.8ప్రకారం అతని ప్రవర్తనను లెవల్ 2నేరంగా పరిగణించగా.. ఆ పనిష్మెంట్ను శార్దూల్ అంగీకరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్లోని అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేకు మ్యాచ్ ఫీజులో 100శాతం జరిమానా విధించడంతో పాటు.. అతనిపై ఒక మ్యాచ్ నిషేధాన్ని ఐపీఎల్ యాజమాన్యం విధించింది. ఆమ్రే ప్రవర్తనను కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.2ప్రకారం లెవెల్ 2నేరంగా పరిగణించగా.. అతను ఈ పనిష్మెంట్ను అంగీకరించాడు.

ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ చివరి ఓవర్లో 36పరుగులు అవసరమైన దశలో ఢిల్లీ ప్లేయర్ రోవ్ మాన్ పావెల్ చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో మెక్ కాయ్ వేసిన తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని మెక్కాయ్ ఫుల్ టాస్ వేశాడు. ఆ బంతిని కూడా పావెల్ సిక్స్ కొట్టాడు. అతని నడము కంటే ఎత్తులో టాస్ పడిందని నోబాల్ ప్రకటించాలని ఢిల్లీ టీం సభ్యులు డగౌట్ నుంచి అరిచారు. కానీ అంపైర్ నితిన్ మీనన్ నోబాల్ ఇవ్వలేదు.
దీంతో ఆగ్రహం చెందిన రిషబ్ పంత్.. ఇంకా అవసరం లేదు పావెల్.. వాళ్లకు గెలుపు ఇచ్చేసి వచ్చేయ్ అంటూ డగౌట్ నుంచి పిలిచాడు. ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ ఆమ్రే స్టేడియంలోకి పరిగెత్తి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. శార్దూల్ ఠాకూర్ సైతం పంత్కు వంత పాడుతూ.. వచ్చేయండంటూ పావెల్, కుల్దీప్లకు సైగ చేశాడు. దీంతో వీరి ప్రవర్తన సంచలనంగా మారింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఐపీఎల్ యాజమాన్యం వీరికి రూల్స్ ప్రకారం.. పనిష్మెంట్లు, ఫైన్లు విధించింది.