
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ప్లేయర్లు మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్లతో సహా టీం మేనేజ్మెంట్ యూనిట్లోని ఆరుగురు సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. దీంతో వారితో సహా ఢిల్లీ ప్లేయర్లందరికి బీసీసీఐ క్రమం తప్పకుండా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తోంది. గురువారం ఉదయం మరో రౌండ్ RT-PCRపరీక్షలను ఢిల్లీ ప్లేయర్లందరికీ నిర్వహించగా.. తొలుత పాజిటివ్ అని తేలిన వారు కాకుండా మిగిలిన వారందరికీ నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చింది.
ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 22 (శుక్రవారం)న రాజస్థాన్ రాయల్స్తో ఆడాల్సి ఉంది. దీంతో ఢిల్లీ ఆటగాళ్లకు రౌండ్ల వారీగా కోవిడ్ పరీక్షలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ తొలుత షెడ్యూల్ ప్రకారం.. పూణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ ఢిల్లీ టీంలో కరోనా కలకలం రేగడంతో మ్యాచ్ వేదికను ముంబైలోని వాంఖడే స్టేడియానికి మార్చారు. అలాగే నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ కూడా పూణేలో జరగాల్సి ఉండగా.. బ్రబౌర్న్ స్టేడియంలో జరిపారు. శుక్రవారం ఉదయం ఆటగాళ్లకు మరో రౌండ్ కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఢిల్లీ ప్లేయర్లలో పాట్రిక్ ఫర్హత్ (ఫిజియోథెరపిస్ట్), చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్), మిచెల్ మార్ష్ (ప్లేయర్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాష్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ సభ్యుడు), టిమ్ సీఫెర్ట్ (ప్లేయర్) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరు 7రోజుల ఐసోలేషన్ పీరియడ్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయం పంజాబ్ కింగ్స్ టీం యూనిట్కు కూడా కొవిడ్ పరీక్షలు జరపనున్నారు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. కాగా పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 25న ముంబైలోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరగనుంది. ఇక నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో నాలుగింట్లో ఓడిన పంజాబ్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.