
ఢిల్లీ క్యాపిటల్స్ను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్హర్ట్ కోవిడ్ బారిన పడగా తాజాగా ఓ ఆటగాడికి కూడా వైరస్ సోకినట్లు ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఆ ఆటగాడు ఎవరో కాదని ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ అని వార్తలు వెలువడ్డాయి. గాయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆలస్యంగా చేరిన మిచెల్ మార్ష్ కరోనా సోకిన ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్హర్ట్తో సన్నిహితంగా మెలిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అతనికి కరోనా సోకి ఉండవచ్చనే వార్తలు వెలువడ్డాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆర్టీపీసీఆర్ టెస్టులో మార్ష్కు నెగెటివ్ ఫలితం వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అంతా కూడా ఊపరిపీల్చుకుంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆటగాళ్లందరినీ క్వారంటైన్కు తరలించారు. అయితే ఒకే వ్యక్తిపై ఇలా రెండు వేర్వేరు వార్తలు రావడం క్రికెట్ అభిమానులను అయోమయానికి గురిచేస్తోంది.
కాగా ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు ఫలితాలు రావడంతో బీసీసీఐ మరొక వైద్య బృందాన్ని పంపినట్లు సమాచారం. దీంతో ఆ వైద్య బృందం ఢిల్లీ క్యాపిటల్స్ టీం సభ్యులందరికీ పరీక్షలు చేయనుంది.
కాగా మిచెల్ మార్ష్ను ఢిల్లీ క్యాపిటల్స్ టీం మెగా వేలంలో 6 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
జట్టులో కరోనా కలకలం రేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు పూణే వెళ్లాల్సిన షెడ్యూల్ కూడా వాయిదా పడింది. పూణే వేదికగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే కరోనా కారణంగా ఢిల్లీ టీం సభ్యులంతా 3 రోజులపాటు క్వారంటైన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బుధవారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తి జట్టు
రిషబ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్ట్జే, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ హెబ్బార్, అభిషేక్ శర్మ, కమలేష్ నాగర్కోటి, కేఎస్ భరత్, మన్దీప్ సింగ్, ఖలీల్ సద్కావ్, చేతన్ యాడ్కావ్, చేతన్ యాహ్మద్ , రిపాల్ పటేల్, యష్ ధుల్, రోవ్మన్ పావెల్, ప్రవీణ్ దూబే, లుంగి ఎన్గిడి, విక్కీ ఓస్త్వాల్, సర్ఫరాజ్ ఖాన్.