
మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో ఓటమి చవిచూసింది. గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ అమ్మాయిలు తడబడ్డారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ మంచి నిర్ణయమే తీసుకుంది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ అమ్మాయిలు భారీ స్కోరు చేయలేకపోయారు. దానికితోడు గుజరాత్ ఓపెనర్ ఓపెనర్ సోఫీ డంక్లీ (4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.
అయితే లారా వోల్వార్ట్ (57), ఆష్లీ గార్డనర్ (51) ఇద్దరూ గుజరాత్ను ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కూడా అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోయారు. హర్లీన్ డియోల్ (31) కూడా ఫర్వాలేదనిపించింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాసెన్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. మారిజానే కాప్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి కూడా అనుకున్న ఆరంభం దక్కలేదు. మంచి ఫామ్లో ఉన్న షెఫాలీ వర్మ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరింది.

కెప్టెన్ మెగ్ లానింగ్ (18), అలైస్ క్యాప్సీ (22), మారిజానే కాప్ (36) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు జెమీమా రోడ్రిగెజ్ (1), జెస్ జొనాసెన్ (4), తానియా భాటియా (1), రాధా యాదవ్ (1), పూనమ్ యాదవ్ (0), శిఖా పాండే (8 నాటౌట్) ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే చివర్లో తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (25) మంచి పోరాటం చూపించింది.
ఆమె ఢిల్లీని గెలిపించేలాగే కనిపించింది. కానీ కిమ్ గార్త్ ఆమె ఇన్నింగ్స్కు తెరదించింది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు 136 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్, తనూజా కన్వర్, ఆష్లీ గార్డనర్ తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ చెరో వికెట్ తీసుకున్నారు.