
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నుంచి తప్పుకున్నాడు. వేలి గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి మిశ్రా నిష్క్రమించాడు. మిశ్రా ఐపీఎల్ 13వ సీజన్ మొత్తానికి దూరం అవుతాడని ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన ఓ అధికారి సోమవారం తెలిపారు. మధ్య ఓవర్లలో బాగా బౌలింగ్ చేసే మిశ్రా లేకపోవడం ఢిల్లీకి భారీ ఎదురుదెబ్బే.
గత శనివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వేలికి గాయమైంది. అతడు వేసిన తొలి ఓవర్లో నితీశ్ రాణా ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను అందుకోవడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. దీంతో ఆ మ్యాచ్లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన మిశ్రా.. మైదానాన్ని వీడాడు. అతడి స్కానింగ్ ఫలితాలు సానుకూలంగా లేకపోవడం, గాయం తీవ్రత అధికంగా ఉండడంతో ఐపీఎల్ 2020 మొత్తానికి అతడు దూరమయ్యడు.
అమిత్ మిశ్రా ఐపీఎల్ 13వ సీజన్ మొత్తానికి దూరం అవుతాడని ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన ఓ అధికారి తెలిపారు. 'మిశ్రా రిపోర్ట్స్ వచ్చాయి. ఇది చెడ్డ వార్త. మిశ్రా ఈ సీజన్లోని మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో ఉండడు. అతడి స్థానాన్ని మరొకరితో భర్తీ చేస్తాం. అయితే మంచి లయలో ఉన్న అతడు టోర్నీ నుంచి దూరం కావడం దురదృష్టకరం. అతడి అనుభవం మిడిల్ ఓవర్లలో జట్టుకే కాకుండా యువ స్పిన్నర్లకు ఎంతో ఉపయోగపడుతుంది. అతడు త్వరగా కోలుకోవాలని ఢిల్లీ బృందం మొత్తం కోరుకుంటుంది' అని ఢిల్లీ జట్టు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
షార్జా వేదికగా శనివారం జరిగిన కోల్కతా మ్యాచ్లో 438 పరుగులు నమోదయ్యాయి. చిన్న మైదానంలో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ రెండు ఓవర్లు వేసిన అమిత్ మిశ్రా 14 పరుగులే ఇచ్చాడు. తాను వేసిన తొలి ఓవర్లో గాయపడినా.. ఫిజియో చికిత్స అనంతరం మరో ఓవర్ బౌలింగ్ చేశాడు. ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ను పెవిలియన్కు పంపించి కోల్కతాను దెబ్బతీశాడు. ఆ తర్వాత నొప్పి అధికం కావడంతో డగౌట్కు చేరాడు.
ఈ ఐపీఎల్లో అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ అమిత్ మిశ్రా బాగా బౌలింగ్ చేశాడు. 0/23, 2/35, 1/14 చొప్పున గణాంకాలను నమోదు చేశాడు. 150 మ్యాచ్ల్లో 160 వికెట్లు తీసిన మిశ్రా.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. లసిత్ మలింగ ఐపీఎల్లో 170 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. .