
హైదరాబాద్: వచ్చే ఐపీఎల్ సీజన్లో అజ్యింకె రహానే మరో ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించనున్నాడా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం తమకు అవసరమైన ఆటగాళ్ల కోసం బదలాయింపు కోసం వివిధ ఫ్రాంచైజీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ బౌలర్ మయాంక్ మార్కండేను ఢిల్లీ క్యాపిటల్స్కు బదిలీ చేసి అతడి స్థానంలో షెర్ఫన్ రూథర్ఫర్డ్ను తీసుకుంది.
తాజాగా రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టెన్ అజింకె రహానేను జట్టులోకి చేర్చుకోవాలని ఢిల్లీ ఆరాటపడుతోంది. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఇందులో భాగంగా రహానేకు భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అటు రహానే కానీ, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్రకటన చేయక పోవడం విశేషం.
"అవును, రహానేను సొంతం చేసుకోవాలని డీసీ భావిస్తోంది. అయితే ట్రేడ్ ఆఫ్ జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేం. సంతకాలు చేసే ముందు ఇంకెన్నో ప్రక్రియలు పూర్తిచేయాల్సి ఉంటుంది. రహానే తమకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి రాజస్థాన్ అంత తేలిగ్గా అతడిని వదిలేస్తుందని చెప్పలేం. చర్చలు మాత్రం సాగుతున్నాయి" అని ఈ విషయం తెలిసిన ఒకరు తెలిపారు.
"జట్టులో ఇప్పటికే యువ క్రికెటర్లు ఉన్నారు. క్లిష్ట సమయాల్లో శిఖర్ ధావన్, ఇషాంత్ శర్మ లాంటి సీనియర్ల అనుభవం ఎలా పనికొస్తుందో ఢిల్లీకి తెలుసు. నిలకడైన ఓపెనర్గా ధావన్కు రహానే తోడుగా ఉంటాడన్నది ఆ ఫ్రాంచైజీ ఆలోచన" అని ఒకరు మీడియాకు వెల్లడించారు. ఐపీఎల్ 12వ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో తొలిసారి ప్లేఆఫ్కు చేరింది.
కాగా, తొలి రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్కు ఆడిన అజ్యింకె రహానే 2011లో రాజస్థాన్ రాయల్స్లో చేరాడు. కెప్టెన్గా, ఆటగాడిగా రాజస్థాన్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఆ జట్టుపై నిషేధం విధించిన రెండేళ్లు పుణె ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. గత సీజన్లో రహానే రాజస్థాన్కు కెప్టెన్గా ఉన్నాడు.
అయితే, అంచనాలు అందుకోకపోవడంతో యాజమాన్యం స్టీవ్ స్మిత్కు పగ్గాలు అప్పగించింది. గత సీజన్లో ఒక సెంచరీతో పాటు మొత్తం 521 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఢిల్లీ డేర్డెవిల్స్ను జట్టుని గత సీజన్లో యాజమాన్యం ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. వచ్చే సీజన్ కోసం మరికొన్ని మార్పులకు ఢిల్లీ శ్రీకారం చుట్టింది.