అయ్యర్ ఒక్కడే ఒంటరి పోరాటం
గురువారం నాటి మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్లో అయ్యర్ (43) పరుగులు చేయగా... చివర్లో ఢిల్లీ స్కోరు వంద దాటడం కూడా కష్టమే అనిపించింది. చివర్లో అక్షర్ పటేల్(23 నాటౌట్), క్రిస్ మోరిస్(17) దూకుడుగా ఆడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.
పాంటింగ్ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం పాంటింగ్ మాట్లాడుతూ "పిచ్ స్పందించిన తీరు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. మ్యాచ్కి ముందు గ్రౌండ్స్మెన్తో మాట్లాడితే, ఈ పిచ్ బెస్ట్ అని చెప్పారు. అయితే ఇది చెత్త పిచ్ అని మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే అర్థమైంది. పిచ్ నెమ్మదిగా స్పందించడమే కాకుండా... అనూహ్యమైన బౌన్స్ కూడా లభించింది" అని అన్నాడు.
నబీ, రషీద్ ఖాన్లు అద్భుతం
ఆప్ఘన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరిద్దరూ 8 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చారు. దీనిపై పాంటింగ్ "చూడండి, చివరకు హైదరాబాద్ బౌలర్లకు ఈ పిచ్ సరిగ్గా సరిపోయింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, పిచ్కు తగ్గట్లుగా బౌలింగ్తో చెలరేగారు" అని వెల్లడించాడు.
మా జట్టుకు మంచి ఆరంభం లభించలేదు
"మా జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఈ విషయంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. మా గ్రౌండ్లో ప్రత్యర్థుల కంటే మెరుగ్గా ఎలా ఆడాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మూడు మ్యాచ్లు జరగ్గా, రెండు మ్యాచ్ల్లో మా ప్రత్యర్థులు మాకంటే మెరుగ్గా రాణించి విజయాలను నమోదు చేశారు" అని పాంటింగ్ అన్నాడు.
పిచ్ ఇలా ఉంటుందని ఊహించలేదు
"ఈ విషయంలో మేం మెరుగు అవ్వాల్సి ఉంది. మేం పిచ్ ఇలా ఉంటుందని ఊహించలేదు. గ్రౌండ్స్మెన్ చెప్పినట్లు ఈ పిచ్ లేదు. ఇక మా బ్యాట్స్మెన్ చెత్త షాట్లు కూడా మా కొంప ముంచింది. పృథ్వీ షా చెత్త షాట్తో వెనుదిరిగాడు. కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా అలానే ఆడి మూల్యం చెల్లించుకున్నారు" అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
స్వల్పస్కోర్తోనే 19వ ఓవర్ వరకు పోరాడారు
ఈ ఫార్మాట్లో శిఖర్ ధావన్, క్రిస్ మోరిస్ అనుభవం ఉన్న ఆటగాళ్లు. కానీ, ఈ ఇద్దరూ ఆశించిన మేరకు ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇది కూడా ఢిల్లీ ఓటమికి కారణమని పాంటింగ్ వెల్లడించాడు. అయితే, ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా రాణించారని, స్వల్పస్కోర్తోనే 19వ ఓవర్ వరకు పోరాడారని పాంటింగ్ తెలిపాడు.