
మహిళల ప్రీమియర్ లీగ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు తేలిపోయారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో భారీ స్కోర్లు చేసిన ఢిల్లీ జట్టు.. ముంబై బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. కట్టుదిట్టంగా బంతులు వేస్తూ ఢిల్లీ బ్యాటర్లను ముంబై బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఢిల్లీ బ్యాటర్లందరూ వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. ఒకానొక సమయంలో ఢిల్లీ జట్టు కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనిపించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ తమ బ్యాటింగ్పై నమ్మకంతో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఈ నిర్ణయం బాగా దెబ్బకొట్టింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే షెఫాలీ వర్మ (2) అవుటైపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. మెగ్ లానింగ్ (43), జెమీమా రోడ్రిగెజ్ (25), రాధా యాదవ్ (10) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చెయ్యలేదంటేనే.. ఢిల్లీ బ్యాటింగ్ ఎంత దారుణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
షెఫాలీ అవుటైన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న అలైస్ క్యాప్సీ (6), మారిజానే కాప్ (2) దారుణంగా ఫెయిలయ్యారు. జెమీమా కాసేపు జాగ్రత్తగా ఆడింది. కానీ ఆమె అవుటైన తర్వాత వచ్చిన జెస్ జోనాసెన్ (2), తానియా భాటియా (4), మిన్ను మణి (0), టారా నోరిస్ (0), శిఖా పాండే (4 నాటౌట్) కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆ జట్టు కనీసం 100 పరుగులు కూడా చేయదేమో అనిపించింది. ఈ క్రమంలోనే 18 ఓవర్లు 105 పరుగులు చేసిన ఢిల్లీ ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్, ఇస్సీ వాంగ్, హేలీ మాథ్యూస్ తలో మూడు వికెట్లతో చెలరేగారు. పూజా వస్త్రాకర్ కూడా ఒక వికెట్ తీసుకుంది.