|
శ్రీలంకపై 144 పరుగుల తేడాతో భారీ విజయం
తుదిపోరులో శ్రీలంకపై 144 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అండర్ 19 ఆసియా కప్ను చేజిక్కించుకున్నారు. యంగ్ ఇండియా ఆసియా కప్ను గెలవడం ఇది ఆరోసారి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్ 19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 85), అనూజ్ రావత్ (79 బంతుల్లో 57) అద్భుతంగా ఆడి భారత్కు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాట్స్మన్
టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ దేవ్దత్ పడిక్కల్ (43 బంతుల్లో 31) రాణించడంతో 40 ఓవర్లలో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేయగలిగింది. అయితే ఆఖరి ఓవర్లలో కథ మొత్తం మారిపోయింది. ఆఖరి 9 ఓవర్లలో కెప్టెన్ ప్రభ్సిమ్రన్ సింగ్ (37 బంతుల్లో 65 నాటౌట్), అయూష్ బదోని (28 బంతుల్లో 52 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి ఆఖరి 9 ఓవర్లలో 100 పరుగులు రాబట్టారంటే ఏ విధంగా ఆడారో అర్థమవుతోంది.
|
విశేషంగా ఐదు ఓవర్లలోనే 79 పరుగులు:
ఆఖరి ఐదు ఓవర్లలోనే 79 పరుగులు చేయడం విశేషం. దీంతో 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ నిపున్ ధనంజయ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అనంతరం వచ్చిన సూరియబండార (32 బంతుల్లో 31).. మరో ఓపెనర్ నిషాన్ మదుష్క (67 బంతుల్లో 49)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే వీరి భాగస్వామ్యాన్ని హర్ష్ త్యాగి విడదీశాడు.
|
38.4 ఓవర్లలో శ్రీలంక 160
మిడిలార్డర్ బ్యాట్స్మన్ నవోద్ పరణవితన (61 బంతుల్లో 48) తప్ప ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో 38.4 ఓవర్లలో శ్రీలంక 160 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. భారత బౌలర్ హర్ష్ త్యాగి అత్యధికంగా 6 వికెట్లు పడగొట్టాడు. సిద్ధార్థ్ దేశాయ్ రెండు, మోహిత్ జంగ్రా ఒక వికెట్ తీశారు. హర్ష్ త్యాగికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'అవార్డు దక్కింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్'అవార్డు అందుకున్నాడు.