200 పరుగులు చేస్తాం అనుకున్నాం:
'ఇన్నింగ్స్ చివరలో మా బ్యాట్స్మెన్ బాగా రాణించలేదు. ఒక సమయంలో మేము 200 పరుగులు చేస్తాం అనుకున్నాం. కానీ.. చివరలో డిల్లీ బౌలర్లు మా బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. ముఖ్యంగా రబాడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. అతని బౌలింగ్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాం. ఈ వికెట్ మ్యాచ్ మొత్తం ఒకేలా స్పందించింది. టోర్నీలో ఇదే బెస్ట్ వికెట్' అని స్మిత్ పేర్కొన్నారు.
40 ఓవర్ల పాటు ఒకేలా ఉంది:
'డిల్లీ బ్యాట్స్మెన్ పవర్ ప్లేలో మా బౌలర్లను ఒత్తిడికి గురిచేశారు. శిఖర్ ధావన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ను దూరం చేసింది. శ్రేయస్ గోపాల్ను పవర్ ప్లేలో బౌలింగ్ వేయించాలని అనుకోలేదు. కానీ.. పిచ్పై మంచు ఉండడంతో గోపాల్కు బౌలింగ్ ఇచ్చాం. మంచు పడుతున్న సమయంలో బౌలర్లకు బంతి మీద పట్టు తప్పుతుంది. ఈ వికెట్ 40 ఓవర్ల పాటు ఒకేలా స్పందించింది. ఇలాంటి పిచ్పై కీలక బౌలర్లను డెత్ ఓవర్లలో వేయించడం సరైంది.. డిల్లీ ఇక్కడే విజయవంతం అయింది. ఆర్చర్ టోర్నీ మొత్తం బాగా రాణించాడు' అని స్మిత్ తెలిపారు.
పంత్, ధావన్ల మెరుపులు:
మొదటగా బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రహానే (105 నాటౌట్; 63 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ.. కెప్టెన్ స్మిత్ (50; 32 బంతుల్లో 8ఫోర్లు)లు అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. రిషబ్ పంత్ (78 నాటౌట్; 36 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ ధావన్ (27 బంతుల్లో 54; 8 ఫోర్లు, 2 సిక్స్లు) పవర్ ప్లేలో అదరగొట్టాడు.