
అబుధాబి వేదికగా జరిగిన టీ20 లీగ్లో టీమిండియా వెటరన్ సురేశ్ రైనా ప్రాతినిధ్యం వహిస్తున్న డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు ట్రోఫీ అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన ఈ జట్టు.. ఎలిమినేటర్లో టీం అబుధాబిని ఓడించింది. అనంతరం రెండో క్వాలిఫైయర్లో శాంప్ ఆర్మీని కూడా ఓడించి ఫైనల్ చేరింది.
అదే సమయంలో అత్యధిక పాయింట్లతో టేబుల్ టాపర్గా నిలిచిన అరంగేట్ర జట్టు న్యూయార్క్ స్ట్రైకర్స్.. తొలి క్వాలిఫైయర్లో శాంప్ ఆర్మీని ఓడించి నేరుగా ఫైనల్ చేరింది. ఫైనల్లో టాస్ గెలిచిన న్యూయార్క్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సురేశ్ రైనా తను ఎదుర్కొన్న రెండో బంతికే బౌండరీ బాదాడు. అయితే తొలి ఓవర్ చివరి బంతికే పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కాసేపటికే ఆండ్రీ రస్సెల్ కూడా అవుటవడంతో డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది. ఇలాంటి సమయంలో కెప్టెన్ నికోలస్ పూరన్ (23 బంతుల్లో 40) అదరగొట్టాడు. చివర్లో డేవిడ్ వీజ్ (18 బంతుల్లో 43 నాటౌట్) దంచి కొట్టాడు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడటంతో డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టు పది ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో న్యూయార్క్ స్ట్రైకర్స్ తడబడింది. జోష్ లిటిల్ (2/4), మహమ్మద్ హస్నయిన్ (2/14) రాణించడంతో ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. న్యూయార్క్ బ్యాటర్ కీరన్ పొలార్డ్.. 23 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుతిరగడంతో ఆ జట్టు విజయావకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక ఇన్నింగ్స్ ముగిసే సరికి న్యూయార్క్ జట్టు 5 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సురేశ్ రైనా అండ్ కో కప్పు అందుకున్నారు. గతేడాది కూడా డెక్కన్ గ్లాడియేటర్స్ జట్టే ట్రోఫీ నెగ్గిన సంగతి తెలిసిందే.