
ముంబై: టీమిండియా బౌలర్లు దీపక్ చహర్, సిద్దార్థ్ కౌల్ కొవిడ్ 19 మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్లో పోస్టు చేస్తూ.. వ్యాక్సిన్ వేసుకున్నాం, మీరు కూడా వేసుకోండి అని అన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండని ప్రజలను కోరారు. టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. గత మంగళవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ వాయిదా పడటంతో ఇళ్లకు చేరుకున్న ప్లేయర్స్.. తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా తీసుకుంటున్నారు.
టీమిండియా పేసర్ దీపక్ చహర్ మంగళవారం కొవిడ్ 19 మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు. 'ఈ రోజు నా మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నా. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా టీకా వేయించుకోవాలని కోరుతున్నా. మా కోసం శ్రమిస్తున్న పోలీసులు, వైద్యులు ఇతర ఫ్రంట్లైన్ సిబ్బందికి ధన్యవాదాలు. క్లిష్ట సమయంలో మీరు అందించే సేవలు ఎప్పటికీ మర్చిపోము. ఈ మహమ్మారి బారి నుంచి తొందరగా బయటపడతామని ఆశిస్తున్నా' దీపక్ చహర్ ట్వీట్ చేశాడు.
'కరోనాపై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించడానికి ఉన్న ఏకైక మార్గం టీకా వేసుకోవడం. ఈ రోజు నా మొదటి డోసు టీకా తీసుకోవడం పూర్తయింది. దయచేసి అందరూ టీకా తీసుకోవాలని కోరుతున్నా. మన జీవితాలు సాధారణ స్థితికి రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా' అని వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను సిద్ధార్థ్ కౌల్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు శిఖర్ ధావన్, అజింక్యా రహానే, ఛతేశ్వర్ పూజారా, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా మొదటి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే.
భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్వుమన్ స్మృతి మందాన కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు టీకా వేసుకున్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను మందాన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. 'మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నా. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి' స్మృతి ట్వీట్ చేశారు. త్వరలో భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో ఏకైక టెస్టులో తలపడనుంది. ఈ టూర్లోనే మూడు వన్డేలు, మూడు టీ20ల్లో ఆడనుంది.