
హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ హీరో, సూపర్ స్టార్ అమితా బచ్చన్ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న షో 'కౌన్ బనేగా కరోడ్పతి'. కేబీసీ ప్రతి సీజన్ సక్సెస్ఫుల్గా సాగుతొంది. అంతేకాదు టీఆర్పీల్లో కూడా దూసుకెళ్లింది. ఇందుకు కారణం మాత్రం అమితా బచ్చన్. ప్రతి సీజన్లో ప్రత్యేక అతిథులతో అమితాబ్ అలరిస్తున్నాడు. అమితాబ్ ఈ షోలో కంటిస్టెంట్లకు పలు ప్రశ్నలు వేస్తాడు. ఇందులో క్రికెట్ ఆటకు సంబందించినవి కూడా ఉంటాయి.
గత సీజన్ జరుగుతున్నపుడు అమితాబ్ ఓ కంటిస్టెంట్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-12లో ఎవరు పర్పుల్ క్యాప్ సాధిస్తారు అని అడిగాడు. దీనికి ఇమ్రాన్ తాహిర్ (A), కగిసో రబాడా (B), దీపక్ చాహర్ (C), శ్రేయాస్ గోపాల్ (D) పేర్లను ఆప్షన్లుగా ఇచ్చాడు. కంటిస్టెంట్ ఎదో సమాధానం చెప్పారు. ఇప్పుడు దీపక్ చాహర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీతో ఆ విషయాన్ని గుర్తు చేసాడు. అమితాబ్ ఫొటోను షేర్ చేసి.. తన పేరును హైలైట్ చేసి '2020లో ఆప్షన్ సి' అని ఎడిట్ చేసాడు. అంటే ఐపీఎల్-2020లో నేనే పర్పుల్ క్యాప్ సాధిస్తా అని దీపక్ ధీమా వ్యక్తం చేసాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లకు ఓ వరం. పెద్ద, చిన్న ఆటగాళ్లు అనే తేడా లేకుండా ఇందులో పాల్గొంటారు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఆయా ఫ్రాంచైజీల కోసం ఆడుతున్నారు. ఈ లీగ్ టీమిండియాకు ఎంతో దోహదం చేసింది. ఎందరో యువ ఆటగాళ్లు జాతీయ జట్టులోకి రావడానికి ఉపయోగపడింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, దీపక్ చాహర్ లాంటి ఎందరో ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు.
దీపక్ చాహర్ ప్రస్తుతం ఐపీఎల్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. గత సీజన్లో అనేక సందర్భాల్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అండగా నిలిచాడు. బంతి ఇచ్చిన ప్రతిసారి వికెట్లు తీసి మహీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సీజన్-12లో 17 మ్యాచులలో 22 వికెట్లు పడగొట్టాడు. జట్టుకు ప్రధాన బౌలర్గా మారాడు. ఈ ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చాడు. మొదటగా భారత్ vs వెస్టిండీస్ టీ20 సిరీస్కు ఎంపికయి సత్తాచాటాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్లో కూడా ఆడి.. త్వరలో జరిగే బంగ్లా సిరీస్కు ఎంపికయ్యాడు.